MGBS | హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని మూసీ వరద ముంచెత్తింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఎంజీబీఎస్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిల పైనుంచి మూసీ ఉరకలేస్తోంది. దీంతో ఎంజీబీఎస్ను వరద నీరు చుట్టుముట్టింది. ఎంజీబీఎస్లోకి వరద నీరు రావడంతో.. తాత్కాలికంగా మూసివేశారు. ఎంజీబీఎస్ లోపలికి ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్లోకి వరద నీరు చేరుకున్నట్టు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తాత్కాలికంగా మళ్లించామని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్నగర్ వరకు, కర్నూల్, మహబూబ్నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్ వద్ద మళ్లిస్తున్నారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జేబీఎస్ వరకు అనుమతిస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్లను మార్చామని సుఖేందర్ రెడ్డి తెలిపారు. రేపు మరో వంద మంది ఎంజీబీఎస్ సిబ్బంది అదనంగా విధుల్లో ఉంటారని చెప్పారు.