సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ఎయిర్పోర్టు రోడ్డులో మెట్రో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు లోపలి వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గంలో పిల్లర్ల నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్స్ కోసం భూసార పరీక్షలు చేస్తున్నారు. నానక్రాంగూడ ఔటర్ రింగు రోడ్డు సమీపంలో భారీ కేడ్లను ఏర్పాటు చేసి బోర్వెల్ యంత్రాలతో భూమి లోపలి భాగాన్ని తవ్వుతూ నేల స్వభావాన్ని గుర్తిస్తున్నారు. మొత్తం 31 కి.మీ పొడవునా నిర్మించే ఈ మెట్రో మార్గంలో అవసరమైన చోట ముందుగానే నేల గట్టిదనాన్ని తెలుసుకునేందుకు ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థను ఎంపిక చేయడంతో అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు రైట్ ఆఫ్ వే మార్గంలో ఉన్న స్థలాన్ని వాహనాలు, యంత్రాలు సాఫీగా వెళ్లేలా చదును చేశారు. రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి మొదలయ్యే 31 కి.మీ ఎయిర్పోర్టు మార్గంలో పలుచోట్ల గుట్టలు, ఎత్తయిన ప్రాంతాలు ఉండటంతో వాటిని నేలకు సమాంతరం చేశారు.
తుదిదశకు చేరిన నిర్మాణ సంస్థ ఎంపిక
మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే సంస్థను ఎంపిక చేసే ప్రక్రియ తుది దశకు చేరింది. ఇటీవలె టెండరు ప్రక్రియ పూర్తి కాగా, అర్హత కలిగిన కంపెనీని ఎంపిక చేసే పనిలో మెట్రో అధికారులు నిమగ్నమై ఉన్నారు. మరో వారం రోజుల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే సంస్థను ప్రకటిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. టెండర్ వేసిన రెండు నిర్మాణ సంస్థలైన ఎల్అండ్టీ, ఎన్సీసీ ఇన్ఫ్రా కంపెనీలకు మెట్రో రైలు ప్రాజెక్టులను నిర్మించిన అనుభవం ఉందని, ఈ కంపెనీల టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను నిపుణులు పరిశీలిస్తున్నారని, త్వరలో ఒక కంపెనీని ఎంపిక చేస్తామని మెట్రో అధికారులు తెలిపారు.