ఐటీతో మెట్రోలో పెరిగిన రద్దీ
మెట్రోలో ప్రతిరోజూ.. 2.75 లక్షల మంది జర్నీ
అమీర్పేట్ నుండి రాయదుర్గం వరకు షార్ట్లూప్
10 రోజుల్లో 50 వేలు పెరిగిన ప్రయాణికులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలులో ఐటీ ఉద్యోగులతో సందడి నెలకొంది. మార్చి నెలాఖరు వరకు ప్రతిరోజూ దాదాపు 2.20లక్షల మంది ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 2.75 లక్షలకు పెరిగిందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయి.. సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను పూర్తి స్థాయిలో తెరిచారు. ఉద్యోగులు ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆఫీసులకు వచ్చి పని చేస్తున్నారు. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే ఐటీ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
మెట్రో రైళ్లలో ప్రస్తుతం సందడిగా మారింది. నగరంలోని ఎల్బీనగర్, నాగోల్, మియాపూర్, సికింద్రాబాద్, అమీర్పేట ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లోని మాదాపూర్, రాయదుర్గం వరకు వచ్చేందుకు మెట్రో రైలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం మెట్రో రైలులో ప్రయాణించే ఐటీ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఐటీ కారిడార్ వైపు వెళ్లే మార్గంలో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం రద్దీ సమయాల్లో 5 నిమిషాలకు ఒక రైలు ఉండగా, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 3 నిమిషాలకు ఒక రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.