సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్ చేంజ్లు ఉండగా, మరో 3 చోట్ల కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్లన్నీ ప్రజా రవాణా పరంగా ఎంతో కీలకమైనవి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే జాతీయ రహదారులతో పాటు రాష్ట్రంలోని జిల్లాల నుంచి ప్రధాన రహదారులను కలుపుతూ ఉంటాయి. ఇలాంటి చోట ప్రజా రవాణా వ్యవస్థకు అనుకూలమైన మౌలికవసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉంటుంది.
ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ మెట్రో అధికారులు ఐటీ కారిడార్లోని మొదటిదశ మెట్రో మార్గంలోని చివరి మెట్రో స్టేషన్ అయిన రాయదుర్గంతో అనుసంధానం చేస్తూ శంషాబాద్ అంతరాత్జీయ విమానాశ్రయం వరకు మార్గ మధ్యలో ఓఆర్ఆర్ వెంబడి ఉన్న 5 ఇంటర్చేంజ్లను కొత్తగా నిర్మించే మెట్రో స్టేషన్లతో అనుసంధానం చేయనున్నారు. ఇందులో నానక్రాంగూడ, నార్సింగి-మంచిరేవుల, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్లలోని ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ల వద్ద మెట్రో స్టేషన్లను నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి నగరం నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లాలంటే మెట్రో రైలు మార్గం ద్వారా సులభంగా ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రయాణికులు తమ తమ గమ్య స్థానాలను చేరుకునేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నామని మెట్రో అధికారులు తెలిపారు.