Hyderabad Metro | సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థల్లో అత్యంత కీలకమైనది మెట్రోరైలు. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నా, మెట్రోరైలు ప్రయాణం మాత్రం ఎంతో ప్రత్యేకత అనేలా ఉంటుంది. అలాంటి మెట్రోలో నగరవాసులు ప్రయాణించాలంటే భారంగా భావిస్తున్నారు. ఆదరణ పొందిన ప్రజా రవాణాను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లాల్సిన ఎల్అండ్టీ మెట్రో సంస్థ రాయితీలకు కోత విధిస్తున్నది.
నగరంలో మెట్రో ప్రయాణం అంటే కాస్త ప్రియమే అయినా, నిర్ణీత సమయంలో నిర్దేశిత గమ్యస్థానానికి చేర్చుతు న్నది. అలాంటి మెట్రోను ఎక్కువమంది ప్రయాణికులకు అందుబాటులో ఉంచాల్సిన సంస్థ దూరం చేసేలా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలున్నా యి. ఇప్పటివరకు సెలవు రోజుల్లో హైదరాబాద్ మెట్రోరైలులో ప్రయాణించేందుకు సూపర్ సేవర్ ఆఫర్ ఉండేది.
ఏడాదిలో నిర్ణయించిన 100 సెలవుల్లో ప్రయాణం చేసేందుకు వీలుగా సూపర్ సేవర్ కార్డును మెట్రో అధికారులు తీసుకొచ్చారు. రూ.59 సెలవు రోజుల్లో 57 మెట్రో స్టేషన్ల పరిధిలో ఎంత సమయమైనా తిరిగే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ ఆఫర్ మెట్రో ప్రయాణికులకు అందుబాటులో లేదు. అదేవిధంగా 10 శాతం రాయితీతో కూడిన మెట్రో సువర్ణ ఆఫర్ను కూడా ఎత్తివేసింది. ప్రస్తుతం ఎలాంటి టికెట్ రాయితీ ఆఫర్లు మెట్రోలో లేకపోవడంతో ప్రయాణికులు టికెట్ చార్జీలను భారంగా భావిస్తున్నారు.