సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ఎంతో కీలకంగా మారిందని, ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టు కనెక్టివిటీతో కలిసి 70 కి.మీ పొడవునా మెట్రో విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేగంపేటలోని మెట్రో రైల్ భవన్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ప్రతిపాదించిన విస్తరణతో సమాజంలోని అన్ని వర్గాలకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అదేవిధంగా పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆవిర్భవించడంలో సైతం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. రెండో దశ మెట్రో కారిడార్ల కోసం ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్ల తయారీ శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.