సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మెట్రో రెండవ దశలో ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్లు మెట్రో రైలును పొడిగిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించడం లేదని, రెండవ దశ పనులను మూడేండ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఫతుల్లగూడలో అన్ని సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మూడు మతాలకు ఒకే చోట ముక్తిఘాట్ నిర్మించినట్లు చెప్పారు. ముక్తిఘాట్ ఫొటోలను సభ్యులకు చూపిస్తూ, సభ్యులు వెళ్లి చూడవచ్చని తెలిపారు.
ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణంపై హైదరాబాద్ మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగరంలో మెరుగైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. గ్రేటర్ వెస్ట్ జోన్ పరిధిలో పెరగుతున్న ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని మెరుగైన రీతిలో ప్రజా రవాణా సాధనంగా ఎయిర్పోర్టు మెట్రోను నిర్మిస్తున్నారు. గత డిసెంబర్లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం తర్వాత నుంచి ప్రత్యేక బృందాలు 2 నెలలుగా ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి 31 కి.మీ దూరంలో శంషాబాద్ విమానాశ్రయం మార్గంలో సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయి సర్వే పనులు కొనసాగుతుండగా మరో వైపు ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు నిర్మాణ నిర్వహణ కోసం జనరల్ కన్సల్టెంట్ నియామకం పై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు పనులు ఈ వారంలోనే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని మెట్రో అధికారి ఒకరు తెలిపారు.
జన సాంద్రత ఆధారంగా స్టేషన్ల ఖరారు..
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డు పరిధిలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఉన్న 24 కి.మీ మార్గం అత్యంత రద్దీతో కూడింది. ప్రస్తుతం ఇదే మార్గంలో భారీ ఎత్తున ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నివాస ప్రాంతాలు భారీ ఎత్తున విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు ప్రయాణికులే కాకుండా ఈ మార్గంలో ఉన్న ఐటీ కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, అక్కడ 25 ఏళ్లలో పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని మెట్రో స్టేషన్ ఖరారు చేయనున్నారు. ఇప్పటికే మెట్రో ఎం.డి ఎన్వీఎస్ రెడ్డి నేతృత్వంలో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో కలిసి చౌరస్తా, అంతర్గత రహదారులు, ఔటర్ రింగు రోడ్డుపై వెళ్లే ట్రాఫిక్ రద్దీని అంచనా వేస్తున్నారు. మొదటి దశ మెట్రోలో ప్రతి ఒక కిలోమీటర్కు ఒక మెట్రో స్టేషన్ ఉండేలా డిజైన్ చేస్తే, ఈ మార్గంలో జన సాంద్రత ఆధారంగా ప్రతి 2 నుంచి 3 కి.మీటర్లకు ఒక మెట్రో స్టేషన్ను నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం అనువైన ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో గత రెండు వారాలుగా మెట్రో ఎం.డి ఎన్వీఎస్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో సరిపడా నిధులను మెట్రో ప్రాజెక్టుల కోసం కేటాయించడంతో పనుల నిర్వహణను వేగవంతం చేశారు.
అటు ఎయిర్పోర్టు… ఇటు కోర్ సిటీ..
రెండో దశ మెట్రో ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఎయిర్పోర్టు ప్రాజెక్టు అటు విమానాశ్రయం, ఇటు కోర్ సిటీతో అనుసంధానం అయ్యేలా నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే కోకాపేట, నార్సింగి, గండిపేట, మంచిరేవులకు విస్తరిస్తున్న శివారు ప్రాంతాల్లో భారీ బహుళ అంతస్థుల భవనాలు, వ్యాపార, వాణిజ్య, నివాస సముదాయాలు భారీ సంఖ్యలో నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యేందుకు 2 నుంచి 3 ఏండ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో ఆ సమయం వరకు ఎయిర్పోర్టు మెట్రో మార్గాన్ని పూర్తి చేసేలా కార్యాచరణను మెట్రో అధికారులు సిద్ధం చేస్తున్నారు.