ఖైరతాబాద్, ఏప్రిల్ 1 : దివంగత మాజీ సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు కె. విజయరామారావు నిజాయితీ….నిబద్ధతకు నిలువెత్తు రూపంగా నిలిచారని వక్తలు కొనియాడారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం సంస్మరణ సభ జరిగింది. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, విశ్రాంత డీజీపీలు మహేందర్రెడ్డి, ఆంజనేయ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ కొండల్ రావు, ప్రభుత్వ సలహాదారులు జీఆర్రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారులు పాపారావు, ప్రొఫెసర్లు హరగోపాల్, యాదగిరిలు విజయరామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేశవరావు మాట్లాడుతూ విజయరామారావు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఏటూరునాగారంలో జన్మించిన విజయరామారావు ఐపీఎస్ పూర్తి చేసి దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్గా విధులు నిర్వర్తించడం గొప్ప విషయమన్నారు.