సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం చుట్టూ వేల ఏండ్ల నాడే వెలిసిన పురాతన రాతిశిలలను రక్షించుకుందామంటూ నగరానికి చెందిన ‘ది సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రజలతోపాటు యువతకు అవగాహన కల్పిస్తున్నది. ఆయా ప్రాంతాల్లో వెలిసిన రాతి శిలలపై భూ యజమానులను సైతం చైతన్య పరుస్తున్నారు. రాతికొండలను తొలగించకూడదని, వాటి చారిత్రక నేపథ్యం, విశేషాలతో కూడిన అంశాలను వివరిస్తున్నారు. ప్రతినెలా మూడో ఆదివారం ట్రెక్కింగ్ చేయడంతో పాటు నగర నలుమూలల వెలిసిన శిలల పరిరక్షణకు పాటుపడుతున్నారు. ప్రకృతిలో భాగమైన రాతిగుట్టలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నదని చెబుతున్నారు. ప్రతినెలా ఒక్కో ప్రాంతాన్ని సందర్శిస్తూ.. ఒక్కసారి రాతిగుట్టలను కోల్పోతే తిరిగి తెచ్చుకోలేమని, రాళ్లు పర్యావరణ వ్యవస్థను వృద్ధి చేసేందుకు తోడ్పడతాయని వివరిస్తున్నారు.
రాతి కొండల సందర్శనకు సొసైటీ సభ్యులు
నగరంతోపాటు నగర నలుమూలల వెలిసిన రాతి కొండలను సొసైటీ సభ్యులు సందర్శించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అనేక కొండలపై ట్రెక్కింగ్ సైతం నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షురాలు ఫ్రొఫెసర్ ఫాతిమా అలీఖాన్, ఉపాధ్యక్షురాలు సంగీతవర్మ, సెక్రెటరీ ఫారుక్ ఖాదర్, జాయింట్ సెక్రెటరీ పద్మిని పటేల్, ట్రెజరర్ జీఆర్బీ ప్రదీప్ తెలిపారు. ఏప్రిల్లో గండిపేట రాక్స్ను సందర్శించినట్లు పేర్కొన్నారు. మేలో దుర్గం చెరువు దగ్గరున్న గుట్టలను, జూన్లో మౌలాలి రాక్ కాంప్లెక్స్ను, జూలైలో శామీర్పేట దగ్గరున్న వేంకటేశ్వర గుట్టను సందర్శించి వాటిని కాపాడుకోవాలని స్థానికులను కోరుతున్నట్లు తెలిపారు. ప్రతి రాతిగుట్టలను సందర్శించేందుకు సుమారు 50మంది బృందంగా ఏర్పడి, సుమారు మూడు గంటల పాటు విజిట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బృందంలో చిన్నారుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఉంటాయని జీఆర్బీ ప్రదీప్ తెలిపారు.
ఇటీవల వెలుగు చూసిన శిలలు అతిపురాతనమైనవి..
ఇటీవల వెలుగు చూసిన శిలలు అతిపురాతనమైనవని, క్రీస్తు పూర్వం 50వేల ఏండ్ల నుంచి 12,500 ఏండ్ల మధ్య ఎగువరాతి యుగపు ఉపకరణాలతోపాటు పలు చిత్రాలు జూలై 8, 9 తేదీల్లో పలువురు పరిశోధకుల పరిశీలనలో బయల్పడ్డాయని ప్రదీప్ తెలిపారు. అంతటి చారిత్రక ఆనవాళ్లు మన హైదరాబాద్ నగరం చుట్టూ ఉండటం గొప్ప శుభపరిణామమని పేర్కొన్నారు. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉందని చెప్పారు.