డిప్యూటీ స్పీకర్ పుట్టిన రోజు సందర్భంగా మెగా జాబ్మేళా
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తన జన్మదినం సందర్భంగా గురువారం సెట్విన్, ధ్రువ కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా నిర్వహించారు. 36 కంపెనీలు హాజరవ్వగా, 2,200 మంది యువతీయువకులు పాల్గొన్నారు. 600 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
సికింద్రాబాద్, ఏప్రిల్ 7 : అర్హులైన ఉద్యోగార్థులకు భృతి కల్పించాలనే ప్రధాన ధ్యేయంతోనే తన పుట్టిన రోజు సందర్భంగా మెగా జాబ్మేళాను నిర్వహించినట్లు డిప్యూ టీ స్పీకర్ పద్మారావుగౌడ్ తెలిపారు. సీతాఫల్మండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో గురువారం మెగా జాబ్మేళా నిర్వహించారు. సెట్విన్, ధృవ కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ జాబ్మేళాకు నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఈ హాజరయ్యారు. 36 కంపెనీలు 2,200 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. 600 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే మెరుగైన సంస్థలలో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. సాఫ్ట్వేర్, మ్యాన్ఫ్యాక్చరింగ్, ఫార్మా, బ్యాకింగ్ రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మంచి ఉద్యోగాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
చాలా సెక్యూర్గా భావిస్తున్నాను
ఇంతకు ముందు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయలేదు. కానీ, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ జన్మదినం సందర్భంగా జాబ్మేళా నిర్వహిస్తున్నారని తెలిసి వచ్చాను. ఒక సెక్యూర్ ప్లేస్లో నుంచి ఉద్యోగం సంపాదించుకోవటం చాలా సంతోషంగా ఉంది. బీఎస్సీ చదివిన నాకు తొలి అటెంప్ట్లోనే ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. రూ.40 వేల జీతంతో ప్రీమియర్ హెల్త్కేర్ సొసైటీలో ఎంపిక కావడం సంతోషాన్నిస్తుంది. – ఈ.ప్రియాంక, బీఎస్సీ, అల్వాల్
మొదటి సారికే ఉద్యోగం
గతంలో ఏ ప్రాంతంలో కూడా ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఉద్యోగ మేళా పెట్టారని తెలుసుకొని వచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు మున్ముందు మంచి ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడనుంది. పద్మారావుగౌడ్ జాబ్ మేళాను ఏర్పాటుచేసి ఉపాధి కల్పించటం చాలా సంతోషంగా ఉంది.
– జి. సాయిప్రకాశ్ భరత్, బీఎస్సీ, శంషాబాద్