బడంగ్పేట, మార్చి11: మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ పై పెట్టిన అవిశ్వాసం వీగి పోయింది. అవిశ్వాస సమావేశానికి 31 మంది హాజరుకావాల్సి ఉండగా, 29 మందే హాజరయ్యారు. దీంతో కోరం లేని కారణంగా అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి సూరజ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ఎలాగైనా మీర్పేట మేయర్ను పదవి నుంచి దించాలని గత నెల రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేశారు. అన్ని పార్టీల కార్పొరేటర్లకు డబ్బులు ఎరవేశారు. బంపర్ ఆఫర్లు ప్రకటించారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని క్యాంపు రాజకీయం నడిపారు. కార్పొరేటర్లను కొనుగోలు చేసేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్ద మనుషులు రంగ ప్రవేశం చేసి బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వెనుకాడలేదు. క్యాంపు రాజకీయాల్లో బీజేపీ కార్పొరేటర్లకు ఆశ్రయం ఇచ్చింది కూడా కాంగ్రెస్ నేతనే అని తెలిసింది. చివరకు ఓ బీజేపీ కార్పొరేటర్ కాంగ్రెస్లో కలిసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇలా కీలక నేతలు చక్రం తిప్పాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. బీజేపీ వ్యూహం బెడిసి కొట్టింది. కాంగ్రెస్ నాయకులు వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. ఎట్టకేలకు బీఆర్ఎస్దే పై చేయి అయ్యింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వేసిన ఎత్తులను ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి చాకచక్యంగా చిత్తు చేశారు.
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 46 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 22 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 14 మంది బీజేపీ, 10 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి బలం లేకున్నా బల నిరూపణకు పోయి భంగపడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లకు డబ్బుల ఎరవేసి మేయర్ పీటం దక్కించుకోవాలని ప్రయత్నించింది. చివరకు కోరం లేక అవిశ్వాసం వీగిపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కంగుతున్నారు.
ఇదిలా ఉంటే మీర్పేట మేయర్పై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లపై చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి వెల్లడించారు.