కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్) : కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలంగా మార్చిన అపరభగీరథుడు మాజీ సీఎం కేసీఆర్( KCR ) అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పిలుపుమేరకు మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda) ను కార్పొరేటర్లతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి (Godavari) ప్రాణహిత నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ను నిర్మించారని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారాజ్లను నిర్మించి వాటిద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్కు ఎత్తిపోతలతో సాగునీటిని తరలించారన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరిగి సస్యశ్యామలంగా మారిందన్నారు.
మేడిగడ్డ బారేజ్లోని రెండు పిల్లర్లు కుంగిన విషయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం ప్రాజెక్టుపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయడం లేదని. ప్రాజెక్టులో నీళ్లు నింపకుండా కాలయాపన చేస్తూ రైతాంగానికి సాగునీటిని అందించకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం జలాలతో బీడు భూములకు సాగునీటిని అందించే చర్యలు వేగవంతం చేయాలన్నారు.
రాజకీయాలు మానుకుని పిల్లర్లకు మరమ్మతు చేపట్టి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, శిరీషాబాబూరావు, సబీహాబేగం, సతీశ్గౌడ్, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్రెడ్డి, జూపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.