బన్సీలాల్పేట్, సెప్టెంబర్ 21: ఎంతో కష్టపడి చదివి, మెరిట్ ర్యాంక్ సాధించి, పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, ఘనమైన చరిత్ర గల గాంధీ వైద్య కళాశాల ఖ్యాతిని మరింతగా పెంచేలా క్రమశిక్షణతో మెలగాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డీఎంఈ, డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. 2023 – 2024వ బ్యాచ్ ఎంబీబీఎస్ మొదటి ఏడాది విద్యార్థులకు స్వాగత సభ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విద్యార్థులకు యాప్రాన్ (తెల్లకోటు) అందజేసి, అభినందనలు తెలిపారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. తాను కూడా ఇక్కడే ఎంబీబీఎస్ చదివానని, ఇప్పుడు ప్రిన్సిపాల్గా ఉన్నానని అన్నారు.
రాబోయే ఐదున్నర ఏండ్ల కాలం ఎంతో విలువైనదని, పుస్తకాలతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలన్నారు. విద్యార్థులు లైబ్రరీ, రీడింగ్ గదులను సద్వినియోగం చేసుకోవాలని, తోటి విద్యార్థులను, సినియర్లను, అధ్యాపకులను గౌరవించాలని నూతన విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో కష్టపడి చదివి, మెరిట్ సాధించిన పేద విద్యార్థులు ఇక్కడ సీటు సంపాదించుకుని, వైద్య విద్య అభ్యసించడానికి నగరానికి వచ్చారని, వారితో స్నేహంగా ఉండి ఆదర్శంగా నిలవాలని సీనియర్లను కోరారు. తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని, మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు.
కళాశాలలో ర్యాగింగ్ లాంటివి చేస్తే సహించేది లేదని, అలాంటి వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు తమకు ఉన్న ఎలాంటి సమస్యనైనా ప్రిన్సిపాల్ గది వద్ద ఉన్న ఫిర్యాదు పెట్టెలో రాసి వేయాలని, వారి పేర్లు గోప్యంగా పెడతామని చెప్పారు. కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.కృష్ణమోహన్, ఫిజియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి, వివిధ విభాగాల హెచ్ఓడీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తమ పిల్లలు తెల్లకోటు వేసుకున్న రోజు మరచిపోలేమని, విద్యార్థుల తల్లిదండ్రులు వారితో ఫొటోలు దిగి ఆనందంగా, ఉత్సాహంగా కనిపించారు.