సుల్తాన్బజార్,ఏప్రిల్ 16. ఉస్మానియా దవాఖానాలో సీనియర్ పీజీ వైద్య విద్యార్థుల వేధింపులతో జూనియర్ పీజీ వైద్య విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది.తోటి విద్యార్థులు,కుటుంబీకులు న్యాయం జరిగేంతవరకు పోస్టు మార్టం నిర్వహించే లేదని ఉదయం నుండి సాయంత్రం వరకు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కుటుంబీకులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. మృతుడి కుటుంబీకులు న్యాయం చేయాలని నినాదాలు చేయడంతో దవాఖానాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల జిల్లా పాలుగడ్డ తండాకు చెందిన కాట్రావత్ నాగమణి, కాట్రావత్ చందర్ దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా మొదటి కుమారుడు సురేష్ మహబూబ్ నగర్ ఎస్వీఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఈ ఏడాది జనవరిలో ఉస్మానియా దవాఖానా జనరల్ సర్జరీ విభాగంలో పీజీ వైద్య విద్యార్థిగా అడ్మిషన్ పొంది దవాఖానాలోని పీజీ క్వార్టర్స్ హాస్టల్ గదిలో ఉంటూ విద్యను కొనసాగిస్తున్నారు. పది రోజులుగా సీనియర్ పీజీలు అత్యధికంగా డ్యూటీలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని విద్యార్థి సురేష్ తల్లికి, మేనమామకు తెలిపి భాధపడ్డాడు. కాగా గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సురేష్ తల్లికి ఫోన్ చేసి సాధారణంగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు.
నిత్యం తరహా మాదిరి కాకుండా విధులకు హాజరు కాకుండా హాస్టల్ గదిలో పది మాత్రలు మింగినా ఏమి కాకపోవడంతో ఇంజక్షన్ తీసుకొని స్పృహకోల్పోయి కింద పడి ఉన్నాడు. ఈ విషయాన్ని అదే విభాగం పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న అమూల్య అనే వైద్య విద్యార్థిని గుర్తించింది.తోటి విద్యార్థులతో కలిసి గది తలుపులు బద్దలు కొట్టి సురేష్ను లేపేందుకు ప్రయత్నించారు.ప్రయోజనం లేకపోవడంతో తక్షణమే ఉస్మానియా క్యాజువాల్టీకి తరలించారు. అక్కడ సురేష్ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా సురేష్ మృతి చెందిన విషయాన్ని విద్యార్థిని సురేష్ తల్లికి ఫోన్ చేసి సమాచారం అందించారు.
కాగా ఉదయమే సురేష్ మృతదేహాన్ని క్యాజువాల్టీ నుండి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించేందుకు తీసుకువెళ్తుండగా సురేష్ కుటుంబీకులు అడ్డుకొని తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తరలించవద్దని సాయంత్రం వరకు నిరసన కొనసాగించారు. తక్షణమే విభాగం హెచ్వోడి, సీనియర్ వైద్య విద్యార్థులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రావాలని పట్టుబట్టి కూర్చున్నారు.దీంతో దవాఖానాలో నిరసన తెలుపుతున్న వారి వద్దకు చేరుకున్న ఈస్ట్జోన్ డీసీపీ చంద్రమోహన్ సురేష్ కుటుంబీకులతో చర్చించి వారికి నచ్చజెప్పి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
వైద్య విద్యార్థి కాట్రావత్ సురేష్ బలవంతంగా ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు దవాఖానాకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్న విషయం తెలుసుకున్న డీఎంఈ డాక్టర్ నరేందర్రెడ్డి, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాఖేష్ సహాయ్, ఆర్ఎంవో-1డాక్టర్ జయకృష్ణ మృతదేహాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ హెచ్వోడి డాక్టర్ యాదయ్య నేతృత్వంలోని వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా అఫ్జల్గంజ్ పోలీసులు సీనియర్ పీజీ వైద్య విద్యార్థులను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు.