మేడ్చల్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 17.64 కోట్ల నగదు, రూ. 24.66 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 84.445 లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎక్సైజ్ అధికారులు 508 కేసులు నమోదు చేసి, 262 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.
జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ. 4 కోట్ల 30 లక్షల 90 వేల నగదును తిరిగి అప్పగించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. పట్టుబడిన నగదుకు సరైన ఆధారాలు చూపించిన వారికి తిరిగి అందజేస్తున్నట్లు చెప్పారు. గ్రీవెన్స్ కమిటీకి 185 కేసులు రాగా.. అందులో 141 కేసులను పరిష్కరించినట్టు వెల్లడించారు.
మెహిదీపట్నం: మల్లేపల్లి చౌరస్తాలో ఫ్లయింగ్ స్కాడ్ బుధవారం వాహనాల తనిఖీ చేపట్టింది. ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో రూ. 21.50 లక్షల నగదు పట్టుబడింది. ఆసిఫ్నగర్ పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకుని, ఎన్నికల అధికారులకు అప్పగించినట్టు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో సనత్నగర్ నియోజకవర్గం ఫ్లైయింగ్ స్కాడ్ బృందం (ఎఫ్ఎస్), ఎస్సార్నగర్ పోలీసులు కలిసి బుధవారం అమీర్పేట ధరం కరమ్ రోడ్డులో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. సుమారు 200 వాహనాలను తనిఖీ చేశారు. ఎటువంటి పత్రాలు, నంబర్ ప్లేట్లు లేకుండా ఉన్న 10 వాహనాలను సీజ్చేసి, కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.8 లక్షల నగదును ఎస్సార్నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నగదుకు సంబంధించిన ఆధారాలు చూపలేదని, దీంతో నగదును సీజ్ చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ తనిఖీల్లో నియోజకవర్గం ఎన్నికల నోడల్ అధికారి, ఎస్సార్నగర్ డివిజన్ ఏసీపీ వై.వెంకటేశ్వర రావు, ఫ్లెయింగ్ స్కాడ్ బృందం ఇన్చార్జి ఉపేంద్ర, ఎస్సార్నగర్ ఇన్స్పెక్టర్ పి.వి.రామ్ ప్రసాద రావు నేతృత్వంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.