సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ‘బస్సు ఎప్పుడొస్తుంది? వచ్చినా కనీసం నిల్చొనే స్థలమైనా ఉంటుందా? గంటలు గడిచినా బస్సు రావడం లేదాయే? ఈ ఎండలో పడిగాపులు మా వల్ల కావడం లేదు. కాలేజీలు, కార్యాలయాలు, ఆసుపత్రులు వెళుదామంటే..గంటల సమయం వృథా అవుతుంది.’ ఇది బస్టాపులో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల ఆవేదన. సమయానికి బస్సులు రావడం పక్కనపెడితే.. అసలు గంట ఆలస్యమైనా బస్సు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో ప్రతి రోజూ సుమారు 20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
వీరిని గమ్యస్థానాలకు చేర్చడానికి మొత్తం 2640 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు 25 వేల నుంచి 30వేల ట్రిప్పులు నడుస్తుంటాయి. ఈ బస్సులు సరిపోవడం లేదని బస్సుల సంఖ్య పెంచాలని అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా పంపించారు. ఇలాంటి పరిస్థితులతో ఆర్టీసీ సతమతమవుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కొత్త బస్సులు సమకూర్చకుండా.. గ్రేటర్లో ఉన్న అరకొర బస్సుల్లో 1800 సర్వీసులను మేడారం జాతరకు తరలించింది. దీంతో మిగలిన బస్సులు 840 మాత్రమే. వీటితో గ్రేటర్లో లక్షల మంది రాకపోకలు సాధ్యమవుతాయా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఆటోవాలాల ఉపాధిపై దెబ్బ వేసింది. మహిళలకు ఉచిత బస్సు స్కీం ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్లను రోడ్డు పాలుజేసింది. ఆటోల అవసరమే లేదన్నట్టుగా ప్రభుత్వం వారి ఆత్మహత్యలను సైతం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆటోడ్రైవర్లు నిరసనలు, బంద్లు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు గ్రేటర్లో బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రయాణికులు ఆటోల వైపు చూస్తున్నారు. బస్సులు రాకపోవడంతో ఆటోల్లోనే తమతమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
గతంలో సగటున 20 నిమిషాలకు వచ్చే ఆర్టీసీ బస్సు గంట దాటినా రావడంలేదు. గంటపాటు బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తున్నది. ప్రభుత్వం స్పందించి నగరంతోపాటు శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నా.
– పంగ కార్తిక్, ప్రైవేట్ ఉద్యోగి, హయత్నగర్
మేం బస్సులపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటాం. ఈ ఎండలో నాలాంటి వారు ఎంతసేపు నిల్చోగలరు. పోనీ ఏదైన బస్సు వస్తే ఎక్కుదామనుకుంటే బస్టాపులో బస్సులు ఆపడం లేదు. దూరాన ఆపుతున్నారు. నాలాంటి వృద్ధులు అంతదూరం వెళ్లి బస్సు ఎలా ఎక్కుతారు? మరో బస్సు వస్తే అందులో నిల్చొనే స్థలం కూడా లేదు. ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరం. బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.
– స్వామి