అంబర్పేట, సెప్టెంబర్ 3 : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో ఉన్న అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ శాంతినగర్లో రూ.26 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాంతినగర్లో ఉన్న రోడ్లన్నీ అధ్వాన్నంగా మారడం, పైప్లైన్లు ఏర్పాటు చేయడంతో గుంతలుగా మారడం జరిగిన విషయాన్ని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. కొన్ని నెలల కిందనే ప్రతిపాదనలు తయారు చేసి నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. అయితే కాంట్రాక్టర్లు సమ్మెలో ఉండటంతో ప్రారంభోత్సవం ఆలస్యమైందని, లేదంటే ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఈ సుధాకర్, వర్క్ఇన్స్పెక్టర్ రవి, జలమండలి ఏఈ మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, బస్తీవాసులు యాదగిరి, స్వామి, సాయి, హేమంత్, సతీష్, బాలరాజు, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, సుభాష్, చంద్రమోహన్, బీజేపీ నాయకులు చుక్క జగన్, బాలరాజు, శ్రీహరి, సురేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.