బేగంపేట్ డిసెంబర్ 17: ప్రత్యేక కార్యాచరణతో చర్చిలు గ్రేవ్యార్డ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు చర్చిల ప్రతినిధులతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే క్రిస్మస్ విందు, గిఫ్ట్ల పంపిణీపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక విందులను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడంతో పాటు పేద ప్రజలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఆలోచనతో నూతన దుస్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్లను అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే గిఫ్ట్ల పంపిణీ పలు డివిజన్లలో ప్రారంభమైందని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆయా చర్చి కమిటీల సహకారంతో త్వరిత గతిన పంపిణీ చేసేలా చూస్తామని చెప్పారు.
డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. చర్చిలు, గ్రేవ్యార్డ్ల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసిందని శంకుస్థాపన కూడా చేసినట్టు మంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మహేశ్వరి కార్పొరేటర్ హేమలత మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, చర్చి కమిటీ ప్రతినిధులు డీడీ ప్రశాంత్, పాదర్లు ఎడ్వర్డ్ రాజన్, జయరాజ్, రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, హరికృష్ణ, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.