సిటీబ్యూరో, మే 18, (నమస్తే తెలంగాణ): బుక్ చేసిన 24 గంటల్లోనే ట్యాంకర్ను డెలివరీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను జలమండలి వినియోగించిందన్నారు. వేసవి ప్రారంభం కాకముందే ఫిబ్రవరి నుంచే నీటికి డిమాండ్ ఏర్పడటం, బోర్లపై ఆధారపడే ప్రాంతాల ప్రజలు జలమండలి ట్యాంకర్లను భారీగా బుక్ చేసుకున్నట్లు వివరించారు.
పలు ప్రాంతాల్లోని 30వేలకు పైగా ప్రజలు ట్యాంకర్లపైనే ఆధారపడ్డారని, దీంతో 2, 3 రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే స్థితి వచ్చిందన్నారు. ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడటంలో అప్రమత్తమైన ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, ఎండీ సుదర్శన్రెడ్డి వరుస సమీక్షలతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.
ట్యాంకర్ల సంఖ్య పెంచడం, కొత్త ట్యాంకర్ల కొనుగోలుతో పాటు అద్దెకు ట్యాంకర్లను సమకూర్చినట్లు పేర్కొన్నారు. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్స్ను పెంచడం, ట్యాంకర్ డెలివరీలో వేగం పెంచుతూ సిబ్బందిని మూడు షిప్టుల్లో పనిచేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ట్యాంకర్ మేనేజ్మెంట్ సెల్, ప్రత్యేక యాప్ వంటి విధానాలను అమలు చేసి.. ప్రస్తుతం 24 గంటల్లోనే ట్యాంకర్ నీటిని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండీ సుదర్శన్రెడ్డి అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణ, అధికారులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు.