Jalamandali | సిటీబ్యూరో, మే 02 (నమస్తే తెలంగాణ) : ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా పెంచాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ట్యాంకర్ మేనేజ్మెంట్పై గురువారం ఆయన జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ట్యాంకర్ బుకింగ్లు కూడా పెరగవచ్చని, అందుకు అనుగుణంగా ట్యాంకర్ల సంఖ్య, ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచుకోవాలని సూచించారు. ట్యాంకర్ డెలివరీ సమయాన్ని సాధ్యమైనంత తగ్గించాలని ఎండీ సూచించారు. ప్రత్యేక ప్రణాళికల ద్వారా వినియోగదారులకు త్వరగా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయవచ్చని చెప్పారు.
ఏప్రిల్ నెలలో మొత్తం 2,37,570 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామని ఎండీ వివరించారు. కాగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి 613 ట్యాంకర్లు ఉండగా..ప్రస్తుతం 840 వరకు పెంచుకున్నట్లు తెలిపారు. మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకుంటామని వివరించారు. జలమండలి ఏర్పాటు చేసిన చలివేంద్రాలపైనా ఎండీ ఆరా తీశారు. సక్రమంగా నడుస్తున్నాయా లేదా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ గురించి అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. ఎంసీసీతో పాటు స్థానిక కార్యాలయాల్లో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎండీ తెలిపారు. ఈ సమీక్షలో డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, వీఎల్ ప్రవీణ్కుమార్, స్వామి, సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.