సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో బెంగళూరు తరహా నీటి కొరత తలెత్తకున్నా… ప్రజలు పొదుపు పాటిస్తేనే నీటి కటకటను అదుపు చేయవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో నగరంలో నీటి డిమాండు గణనీయంగా పెరిగి, జలమండలి సరఫరాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతున్నది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డు వరకు హైదరాబాద్ మహా నగరంలో మంచినీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది? రానున్న నాలుగు నెలల వరకు సమస్య తలెత్తకుండా ఎలాంటి కార్యాచరణ రూపొందించారనే వివరాలను శనివారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ, ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు వీఎల్ ప్రవీణ్కుమార్ (రెవెన్యూ), రవికుమార్ (టెక్నికల్), స్వామి (ఆపరేషన్స్-2)తో కలిసి మీడియాకు వివరించారు. బెంగళూరు నగర నీటి సరఫరా కేవలం కావేరీ జలాలపైనే ఆధారపడి ఉందని, కానీ హైదరాబాద్కు మాత్రం కృష్ణా, గోదావరి, సింగూరుతో పాటు జంట జలాశయాల నుంచి నీటి సరఫరా ఉన్నందున సమస్య తలెత్తే అవకాశం లేదన్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన వనరులైన కృష్ణా, గోదావరి నుంచి సరఫరా తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నీటిమట్టాలు తగ్గినా అత్యవసర మోటార్ల ద్వారా నగర సరఫరాపై ప్రభావం పడకుండా ఇప్పటికే ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఎండలు పెరుగుతుండటం, అందునా భూగర్భ జలాలు గతం కంటే తీవ్రస్థాయిలో పడిపోయి, బోర్లు ఎండిపోవడంతో సహజంగా నీటి డిమాండు బాగా పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమయంలోనే ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, నిత్యావసరాలకు కాకుండా నీటిని ఇతర అవసరాలకు వినియోగించవద్దని కోరారు. నీటిని వృథా చేస్తే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
ఐదు నీటి వనరుల ద్వారా నగరంలో రోజుకు 559.81 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా.. కృష్ణా నది నుంచి రోజుకు 270 మిలియన్ గ్యాలన్లు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్లో 513.6 అడుగుల నీటిమట్టం ఉండగా… 510 అడుగుల వరకు ఏఎమ్మార్ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకోవచ్చన్నారు. అంతకంటే నీటిమట్టం పడిపోతే పుట్టంగండి వద్ద అత్యవసర మోటర్ల ద్వారా ఎత్తిపోస్తామన్నారు. ఇందుకు రూ.4 కోట్లతో టెండర్ల ప్రక్రియ నిర్వహించి, ఏజెన్సీని ఎంపిక చేశామని, 510 అడుగులు తగ్గగానే 48 గంటల్లోనే అత్యవసర మోటార్లు అమరుస్తామన్నారు.
500 అడుగుల వరకు సాగర్లో 20 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, ఇందులో నగర నీటి అవసరాలకు రానున్న నాలుగు నెలల వరకు ఆరు టీఎంసీలు అవసరమవుతాయన్నారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల తరలింపులోనూ సమస్య తలెత్తకుండా నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని, అక్కడ డెడ్స్టోరేజీ పోను అక్కడ 5.5 టీఎంసీల నీటి లభ్యతలో రానున్న నాలుగు నెలలకు 3.6 టీఎంసీలు అవసరమవుతాయన్నారు.
నీటి వనరుల నుంచి సరఫరా చేస్తున్న పరిమాణాన్ని క్రమంగా పెంచుతున్నామని ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. గతంలో ఎల్లంపల్లి నుంచి తరలించే 25 ఎంజీడీల గోదావరి జలాలను సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు సరఫరా చేశారని, మల్లన్నసాగర్ నుంచి ప్రత్యామ్నాయ సరఫరా ఉండటంతో ఆ నీటిని కూడా నగరానికి తరలిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ కింద ఇతర ప్రాంతాలకు ఇచ్చే నీటిని ప్రత్యామ్నాయాలు ఉన్నందున నగరానికి మళ్లిస్తామని, నగరంలో రోజుకు 559 మిలియన్ గ్యాలన్ల నుంచి మే నాటికి 575 మిలియన్ గ్యాలన్ల వరకు సరఫరాను పెంచుతామన్నారు.
నగరంలో భూగర్భజలాలు పడిపోవడంతో జలమండలి ట్యాంకర్లకు డిమాండు కూడా పెరుగుతున్నదని జలమండలి ఎండీ చెప్పారు. ఈ క్రమంలో జనవరిలో రోజుకు 2వేల ట్రిప్పుల సరఫరా ఉంటే, ఇప్పుడు అది 5800 వరకు పెరిగిందన్నారు. ప్రధానంగా వెస్ట్జోన్ పరిధిలోనే ట్యాంకర్లకు భారీ ఎత్తున డిమాండు వస్తున్నదన్నారు. ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత కొన్నిచోట్ల 3-4 రోజుల వ్యవధిలోనే నీటిని అందిస్తున్నామని చెప్పారు. గతంలో ట్యాంకర్ల సంఖ్య 550 ఉంటే ఇప్పుడు వాటిని 590కి పెంచామని ఎండీ వివరించారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవడంపైనా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, చాలాచోట్ల కరెంటు మోటార్ల ద్వారా నల్లా నీటిని లాగుతున్నందున లోప్రెషర్ సమస్య తలెత్తుతున్నదన్నారు.