Gandhi Medical College | బన్సీలాల్ పేట్, ఏప్రిల్ 11 : గాంధీ మెడికల్ కాలేజ్ 2019 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ పీవి.నందకుమార్ రెడ్డి హాజరయ్యారు. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను, ఎంబిబిఎస్ పూర్తి చేసిన 2019 బ్యాచ్ వైద్య విద్యార్థులందరికీ డాక్టర్ పట్టాలను అందజేసి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో పవిత్రమైన వైద్యవృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలన్నారు. రోగులతో ప్రేమగా వ్యవహరించాలని, ఆప్యాయంగా మాట్లాడాలని సూచించారు. 1973 బ్యాచ్లో గాంధీ మెడికల్ కాలేజీలో తాను చదువుకున్నానని, ఈరోజు వైస్ ఛాన్స్ లర్ హోదాలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉన్నదని అన్నారు. వైద్య విద్యార్థులు పరిశోధన చేయడానికి ముందుకు వస్తే తమ యూనివర్సిటీ ద్వారా వారికి తగిన నిధులను అందించి ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్లో ఉన్న హెల్త్ యూనివర్సిటీ బ్రాంచ్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
డిఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకమైన గాంధీ మెడికల్ కళాశాల ఖ్యాతిని నూతన డాక్టర్లు మరింత పెంచే విధంగా నడుచుకోవాలని సూచించారు. వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి గతంతో పోలిస్తే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నదని అన్నారు. దానిని ఉపయోగించుకుని మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. మారుమూల అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ ప్రజలు వైద్యం కోసం పట్టణానికి రావాల్సి వచ్చేదని అన్నారు. 33 జిల్లాలలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన కేసీఆర్కు ధన్యవాదాలు. ముఖ్యంగా కరోనా రెండు దశల్లో గాంధీ ఆసుపత్రిలో లక్షలాదిమందికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారని, అందుకు పనిచేసిన వైద్యులు సిబ్బందిని అభినందిస్తున్నామని అన్నారు.
గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. ఇందిరా మాట్లాడుతూ.. 2019 బ్యాచ్లో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న 245 మంది విద్యార్థుల్లో 97 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ద్వారా తమ కళాశాలకు చెందిన డాక్టర్ దుర్గం కావ్య గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం అన్నారు.
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్.ఎన్.రాజకుమారి మాట్లాడుతూ.. వైద్యరంగంలో వస్తున్న తాజా మార్పులను నూతన డాక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గాంధీ వైద్య కళాశాల ప్రతిష్టను మరింత చేసే విధంగా వైద్య సేవ అందించాలని ఆమె సూచించారు. అనంతరం నూతన డాక్టర్ల చేత ఆమె ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వాల్యా, వివిధ విభాగాల హెచ్ఓడిలు డాక్టర్ రాజారామ్, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ మురళీధర్, గాంధీ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ లింగమూర్తి, ఎంపిహెచ్ఓ వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.