బంజారాహిల్స్,డిసెంబర్ 22 : బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు. ప్రేమ్నగర్లోని అంబేద్కర్ భవన్ సమీపంలో చాలా కాలంగా మురుగు సమస్యలను పరిష్కరించేందుకు రూ. 18.4లక్షల నిధులతో వేయనున్న సివరేజ్లైన్ పనులను మేయర్ ప్రారంభించారు.
కరాచీ బేకరి కిందిభాగంలో ప్రేమ్నగర్ బస్తీలో రూ.8.4లక్షల వ్యయంతో చేపట్టనున్న సివరేజీ లైన్ పనులను, బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో లోటస్ పాండ్ సమీపంలో రూ.13లక్షల వ్యయంతో సివరేజ్ లైన్ పనులను మేయర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ సమస్యలకు కారణమైన పాతలైన్ల స్థానంలో కొత్త లైన్లను వేస్తున్నామని పేర్కొన్నారు. రెండునెలల క్రితమే ఈ పనులను ప్రారంభించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ ఇతర కారణాలవల్ల ఆలస్యమయిందని, త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 2అదనపు గదుల నిర్మాణ పనులను మేయర్ ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు అదనపు గదుల కోసం రూ.20లక్షల నిధులను అందిస్తున్నారని మేయర్ తెలిపారు.
ఇప్పటికే 4అదనపు గదుల నిర్మాణం పూర్తయిందని, కొత్తగా నిర్మించనున్న గదులతో పాఠశాలలో విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం హరిశంకర్, బంజారాహిల్స్ సెక్షన్ మేనేజర్ ప్రసాద్, తట్టిఖానా సెక్షన్ ఇన్చార్జి మేనేజర్ రాంబాబుతో పాటు టీఆర్ఎస్ నేతలు రావుల విజయ్కుమార్, భగవాన్దాస్, మున్నా, నజీర్ తదితరులు పాల్గొన్నారు.