జవహర్నగర్: ‘కార్పొరేటర్లంతా నా వైపే ఉన్నారు. బలవంతంగా కార్పొరేటర్లను బస్సులో ఎక్కించుకొని పోయినంత మాత్రానా అవిశ్వాసం నెగ్గలేరు. క్యాంపులో ఉన్న కార్పొరేటర్లంతా నాతో ఫోన్లో సంభాషిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గుతా’.. అంటూ మేయర్ మేకల కావ్య ధీమా వ్యక్తం చేశారు. జవహర్నగర్ కార్పొరేషన్లో ఆదివారం మేయర్ మేకల కావ్య అవిశ్వాసంపై స్పందిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జవహర్నగర్ కార్పొరేషన్లో అద్భుతమైన ప్రగతి పనులు చేశామని, ప్రతి డివిజన్లోనూ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లను ఉచితంగా అందజేశామని గుర్తు చేశారు. ‘ నాపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొడతాం. చదువుకున్న మహిళ… పాలనలో ప్రగతి సాధిస్తుందని ఓర్వలేకపోతున్నారు. జవహర్నగర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాను. చదువు, సమాజంపై అవగాహన లేని వారిని కుర్చిలో కూర్చోబెడితే వారు ఆడిందే ఆటా… పాడిందే పాటగా మారుతుందని భ్రమలో ఉన్నారు. వారి ఆటలు ఇకపై సాగినివ్వం… అవిశ్వాసంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. పూర్తి మెజార్టీ ఇప్పటికే ఉంది’ అని చెప్పారు.