సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ బావుటా ఎగుర వేశారని, ఆ ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యం వహించి అందరి సహకారంతో స్వరాష్ట్రం సాకారం చేశారని మేయర్ వివరించారు.
హైదరాబాద్ విశ్వ నగరంగా ప్రసిద్ధి చెందుతున్న నేపథ్యంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు నగరవాసుల తరఫున మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఈఎన్సీ జియాఉద్దీన్, ప్రాజెక్ట్ సీఈ దేవానంద్, సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, అదనపు కమిషనర్ శంకరయ్య, యాదగిరి రావు, కృష్ణ, విజయలక్ష్మి, ఉపేందర్ రెడ్డి, సరోజ, గీతామాధురి, సెక్రటరీ లక్ష్మి, ఎస్ఈ కోటేశ్వర రావు, అదనపు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీసీ సుదర్శన్, ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, జాయింట్ కమిషనర్ ఉమా ప్రకాశ్, డిప్యూటీ కమిషనర్లు అర్చన, శ్రీనివాస్ రెడ్డి, పద్మ ప్రియ, ఎస్టేట్ ఆఫీసర్ బాషా, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు మేయర్, కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.