బంజారాహిల్స్,మే 28 : నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకుల కంటికి కనిపించకపోవడం వారి దివాళాకోరుతనానికి నిదర్శమన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బంజారాభవన్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. వరద సమస్యల పరిష్కారానికి ఎస్ఎన్డీపీ ద్వారా సుమారు వెయ్యి కోట్లతో పనులు చేస్తున్నామని, అండర్పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గిపోయాయని చెప్పారు. బీజేపీ నేతల తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ మూడో వార్డులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి హాజరై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులను నమ్మవద్దని, మరోసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేద్దామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలో వేలకోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీల నాయకుల కంటికి కనిపించకపోవడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని మేయర్ విమర్శించారు. బంజారాహిల్స్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ పరిధిలోని రోడ్ నం 10లోని బంజారా భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నగరంలో దశాబ్దాల కాలంగా ఉన్న వరద సమస్యను పరిష్కరించేందుకు ఎస్ఎన్డీపీ ద్వారా సుమారు రూ.1000కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. అలాగే ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గాయని తెలిపారు. నగరంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రోడ్లు వేస్తున్న చోటకు వచ్చి ఫొటోలు తీసుకుని సోషల్మీడియా ద్వారా గుంతలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు సరైన సమయంలో అవకాశాలు వస్తాయన్నారు. బంజారాహిల్స్తో పాటు అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించిందని తెలిపారు.
తెలంగాణను అభివృద్ధి చేసింది కేసీఆర్ ;ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండేవని, వాటన్నింటిని తొమ్మిదేండ్లలోనే పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తెలంగాణను దేశానికే రోల్మాడల్గా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు మతం పేరుతో ప్రజలను విడదీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కార్యకర్తల మధ్య విభేదాలు తొలగించుకోవడంతో పాటు రానున్న ఎన్నికల కోసం సిద్ధం కావడానికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎస్. ప్రభాకర్రావు, తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కే.విప్లవ్కుమార్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.