ఆకాశానికి చిల్లు పడినట్లుగా నగరంలో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. రోజంతా కురిసిన వర్షాలతో ఈ సీజన్లోనే అత్యధిక వర్షపాతం నమోదయింది. తెరిపివ్వని వానలకు పోటాపోటీగా జీహెచ్ఎంసీ అధికారులూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వర్షం నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ముందస్తుగానే అప్రమత్తం అయిన అధికారులు పౌరుల ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ పరిష్కారం చూపుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో వేగంగా సహాయక చర్యలను చేపడుతున్నారు. నగరంలోని చెరువులు, కుంటలలో వరద తాకిడిని అంచనా వేస్తూ దిగువకు నీరు వదులుతున్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, కమిషనర్ రోనాల్డ్రోస్ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ తగు చర్యలు చేపడుతున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల వరకు 28 ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, 15 ప్రాంతాల్లో వాటర్ నిలిచి, మరో రెండు చోట్ల గోడ కూలిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లుగా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని నగర పౌరులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
– సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నది. పౌరులు అందిం చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల్లో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా నీటి తొలగింపునకు 157 స్టాటిక్ బృందాలు రంగంలోకి దిగి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాల తొలగింపు పనులు చేపడుతున్నాయి. 339 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక డీఆర్ఎఫ్ బృందాలు అక్కడక్కడ విరిగిన పడిన చెట్లను వెను వెంటనే తొలగిస్తూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తున్నారు. నగరంలోని 185 చెరువులు, కుంటల్లో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తుగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదే సమయంలో శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కమిషనర్ రోనాల్డ్రోస్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ తగు చర్యలు చేపడుతున్నారు. కాగా గురువారం సాయంత్రం 7 గంటల వరకు 28 ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, 15 ప్రాంతాల్లో వాటర్ నిలువగా, మరో రెండు చోట్ల గోడ కూలిన ఘటనల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్ , యూబీడీ, డీఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సమన్వయంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడ్డ ముంపు, నీటి నిలువలు, నాలాల తక్షణ తాతాలిక మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని మున్సిపల్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశాల మేరకు గడిచిన రెండు రోజులుగా వరద సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంజినీరింగ్ అధికారులు , కమిషనర్లతో వానకాల సన్నద్ధ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈఎన్సీ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్లు రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, మమత, పంకజ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. వర్షాలతో రోడ్డుపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో ఈవీడీఎం బృందాలు మోహరించి సహాయక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. కాగా శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులకు సూచించారు. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, పలు అభివృద్ధి పనులు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పంజాగుట్ట చౌరస్తాలో భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అక్కడే విధులు నిర్వహిస్తున్న
కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ మ్యాన్హోల్ తెరిచి నీటిని తరలించారు. దీంతో ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్లు, ఇతర వాహనాలు సాఫీగా ముందుకుసాగాయి.
– ఖైరతాబాద్