హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన వినాయచ చవితిని పురస్కరించుకొని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉచితంగా ఒక లక్ష మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పంపిణీ చేశారు.
వినాయక నవరాత్రులను మట్టి విగ్రహాలతో అత్యంత వైభవంగా ఇంటింటా జరుపుకోవాలని అరవింద్ కుమార్ పిలుపునిచ్చారు.
పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవటం వలన పిల్లల్లో పర్యావరణం పట్ల అవగాహన, చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2017 నుంచి మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని 2017లో 30 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తే, 2022లో ఒక లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నదని చెప్పారు.
ఈ నెల 29, 30 తేదీల్లో మాదాపూర్ మైండ్ స్పేస్, పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీ ఆఫీస్, కోటక్ మహీంద్రా బ్యాంకు, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, హెచ్జీసీఎల్ ఆఫీస్ల వద్ద మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో మొబైల్ వెహికల్స్ ద్వారా మియాపూర్లోని ఎస్ఎంఆర్ వినయ్, మై హోం జూవెల్ పైప్ లైన్ రోడ్, ఇతర గేటెడ్ కమ్యూనిటీస్, ఇందు ఫార్ట్చున్ పరిసర ప్రాంతాలు, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మలేషియన్ టౌన్ షిప్లలో పంపిణీ చేస్తారు. మరో 5 ప్రాంతాల్లో రెసిడెన్సీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. విగ్రహాలు పంపిణికి, పర్యవేక్షణకు ప్రాంతాలు వారిగా ఇంచార్జి అధికారులను నియమించారు.