సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : 111 జీవో గ్రహణం వీడింది. రెండున్నర దశాబ్దాలుగా నిలిచిన అభివృద్ధికి ఊతం లభించింది. మహానగరానికి ఆనుకొని మరో ఆధునిక నగరం అవతరించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆ జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఎలాంటి నిబంధనలు అమలవుతున్నాయో అవే అమలు కానుండటంతో ప్రగతి పరుగులు పెట్టనున్నదని, పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందని నిపుణులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జంట జలాశయాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా, పర్యావరణ సమతుల్యతతో మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు హెచ్ఎండీఏ అధికారులు.గ్రీన్సిటీగా అభివృద్ధి చెందేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఆంక్షలతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న జీవో 111 పరిధి సరికొత్త అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారనుంది. నగరాన్ని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నగర శివారులో ఉన్న ఈ ప్రాంతమంతా క్రమపద్ధతిలో పట్టణీకరణ జరగనుంది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ (హెచ్ఎండీఏ) సరికొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ సుమారు 50 కి.మీ దూరం వరకు విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు ఇందులోని 84 గ్రామాల పరిధిలో జీవో 111 కింద ఉండడంతో హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లకు, ఇళ్ల నిర్మాణాలు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులివ్వ లేదు. తాజా నిర్ణయంతో ఆయా గ్రామాల పరిధిని పరిగణలోకి తీసుకొని పర్యావరణ సమతుల్యతతో హరిత పట్టణంగా(గ్రీన్ సిటీ) అభివృద్ధి చెందేలా మాస్టర్ప్లాన్ను రూపొందించే కసరత్తును మొదలు పెట్టనున్నారు. కేబినెట్ నిర్ణయం తర్వాత ప్రభుత్వం జీవో 111పై జారీ చేసే కొత్త జీవోను అనుసరించి ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా 84 గ్రామాల పరిధిలోని భూమిని పరిగణలోకి తీసుకొని మాస్టర్ప్లాన్ను టౌన్ప్లానింగ్ విభాగం రూపొందించనుంది.
అందుబాటులోకి 1.32లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్..
జీవో 111 ఎత్తివేతతో సుమారు 1.32లక్షల భూమి అందుబాటులోకి రానుంది. దీనివల్ల భూముల ధరలు సామాన్యులకు కలిసి రానున్నాయి. దీంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంపై ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిబంధనలతో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. నగరానికి చేరువలో ఉండడం, కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ ఉండడం మరిన్ని పెట్టుబడులకు దారి తీయనుంది. ఇతర మెట్రో నగరాల్లో ఈ స్థాయిలో ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అదే స్థాయిలో పెరిగేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా జంట జలాశయాల చుట్టూ ఉన్న ప్రాంతంలో పుల్ ట్యాంక్ లెవల్ (పూర్థి స్థాయి నీటి మట్టం)ను హెచ్ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇప్పటికే గుర్తించింది. దానికి అనుగుణంగా బఫర్ జోన్ను నిర్ణయించి, ఆ పరిధిలోని ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేకుండా చేస్తే మాస్టర్ప్లాన్ను రూపొందించాలని పట్టణ ప్రణాళికా నిపుణులు సూచిస్తున్నారు.
పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ..
నగర శివారులో ఉన్న జీవో 111 పరిధిలో ఇప్పటికే ఫామ్ హౌస్లు వేల సంఖ్యలో ఉన్నాయి. 500 గజాల నుంచి మొదలు కొని 1000 గజాలతో పాటు పాటు ఎకరం, అర ఎకరం, ఎకరం స్థలంలో ఇప్పటి వరకు ఫాంహౌస్లు రావడంతో ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కూడుకొని ఉంది. ఇలాంటి పచ్చదనాకి ప్రాధాన్యతనిస్తూనే కొత్తగా పట్టణీకరణ జరిగేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించనున్నారు. రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సైతం ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. 1990-2000వ దశకంలో హైదరాబాద్ను ప్రణాళికా రహితంగా అభివృద్ధి చేయడం వల్ల నగరంలోని మంచినీటి చెరువుగా ఉండే హుస్సేన్సాగర్ కాలుష్య కాసారంగా మారింది.
అలాంటి పరిస్థితే రాకుండా ఉండేలా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్సాగర్ను పరిరక్షిస్తూ చుట్టు పక్కల పట్టణీకరణ జరిగేలా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో భూములను పరిశీలించనున్నారు. ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలి ?. ఏం ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు రావాలి? పర్యావరణ పరిరక్షణ కోసం ఖాళీ స్థలాలను ఎంత మేరకు నిర్ణయించాలి? ముఖ్యంగా రెండు జలాశయాల్లోకి వరదనీటి కాలువలు, వాగుల ద్వారా వచ్చే నీరు కలుషితం కాకుండా ఎక్కడెక్కడ డ్రైనేజీ లైన్లు వేయాలన్న దానిపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఔటర్ రింగు రోడ్డు దాటి విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో కొత్తగా అభివృద్ధి చెందే ప్రాంతాన్ని పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఉండేందుకు ఎలాంటి ప్రమాణాలను పాటించాలన్న దానిపై నిపుణులతో చర్చించనున్నారు.
మరో ఆధునిక నగరం
తెలంగాణ ప్రభుత్వం జీవో 111ను రద్దు చేయడంతో ప్రస్తుతం హైదరారాబాద్ మహానగరానికి అనుకొని మరో ఆధునిక నగరం అవతరించేందుకు అవకాశం ఉంది. జీవో 111 పరిధిలోని 84 గ్రామాల పరిధిలో మొత్తం 1.30లక్షల ఎకరాల భూమిలో పట్టణీకరణ వచ్చేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. 27 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై విధించిన ఆంక్షలన్నింటినీ తొలగిస్తూ జీవో 111పై నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్కు సమానమైన విస్తీర్ణంలో కొత్తగా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉన్న పశ్చిమ భాగంలోనే ఎక్కువగా జీవో 111 పరిధి ఉండడంతో ఇటు వైపు మరింత పట్టణీకరణ జరిగేందుకు అనుకూలత ఉంది. ప్రధానంగా హరిత నగరాన్ని నిర్మించేందుకు ఈ ప్రాంతమంతా అత్యంత అనుకూలమైంది.
– సి.శేఖర్ రెడ్డి,సీఐఐ చైర్మన్, మాజీ జాతీయ అధ్యక్షులు,క్రెడాయ్
పర్యావరణానికి ప్రాధాన్యత
జీవో 111 రద్దుతో 84 గ్రామాల పరిధిలో పర్యావరణ పరిరక్షణనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు వచ్చేలా తనిఖీ వ్యవస్థలు ఉండాలి. విశ్వ నగరంగా మారుతున్న హైదరాబాద్కు జీవో 111 పరిధిలోని భూముల్లో జరిగే అభివృద్ధితో మరింత ఆదాయంతో పాటు పెట్టుబడులు వస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలి. కొత్తగా వచ్చే నిర్మాణాల వల్ల కాంక్రీట్ జంగిల్గా మారకుండా లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడంతో పాటు దానికి అనుగుణంగానే నిర్మాణాలు జరిగేలా క్షేత్ర స్థాయిలోని అధికార యంత్రాంగం పర్యవేక్షించాలి.
– జీ.వీ.రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్
గ్రీన్ సిటీ నిర్మాణం జరగాలి
పట్టణాల్లో ప్రజల జీవన శైలి క్రమంగా మారుతున్నది. కాంక్రీట్ జంగిల్గా మారిన హైదరాబాద్ తరహాలో కాకుండా ఒక గ్రీన్ సిటీ తరహాలో జీవో 111 పరిధిలో పట్టణాభివృద్ధి జరగాలి. ఒక కొత్త గ్రీన్ సిటీకి రూపకల్పనను ప్రభుత్వం చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్ప్లాన్ను రూపొందించాలి. ఇలా చేస్తే దేశంలోనే హైదరాబాద్కు మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ మన హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుంది.
– రాజశేఖర్, క్రెడాయ్ హైదరాబాద్, ప్రధాన కార్యదర్శి