మూడు ఐసీఐసీఐ ఏటీఎంలు దగ్ధం
తప్పిన పెను ప్రమాదం
మంటలు ఆర్పిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
ఘట్కేసర్ రూరల్, మే 26: విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా మూడు ఏటీఎంలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి జోడిమెట్లలో గురువారం సాయంత్రం జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వివరాలు.. జోడిమెట్లలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలు ఉన్న గదిలో గురువారం సాయంత్రం విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి.
విషయం తెలుసుకున్న ఘట్కేసర్ పోలీసులు ఫైర్ కార్యాలయానికి సమాచారం అందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో నీటిని తెప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక యంత్రం చేరుకోవడంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఐసీఐసీఐ ఏటీఎం పక్కనే ఉన్న గౌరవ్ ఎలక్ట్రికల్ అండ్ హర్డ్వేర్ దుకాణంలోకి మంటలు వ్యాపించడంతో కొద్దిపాటి నష్టం జరిగింది. మంటలు అదుపులోకి రావటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏటీఎంలో ఎన్ని డబ్బులు ఉన్నాయి.. ఎంత నష్టం జరిగింది.. అనే వివరాలను బ్యాంక్ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.