ముషీరాబాద్ , నవంబర్ 7 : పదేండ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బస్తీల్లో కల్పించిన మౌలిక సదుపాయాలను గమనించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ఆదరించాలని ఆ పార్టీ ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్ పిలుపు నిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాంనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అడిక్మెట్ డివిజన్ నాగమయ్యకుంటకు చెందిన సాయిగౌడ్ వంద మంది తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరా రు. వారందరికీ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్ధానాలతో మరోమారు ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల హితం, అభివృద్ధే లక్ష్యంగా పని చేసిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని తెలిపారు. నిత్యం జనం మధ్య ఉండి పని చేసే తనను ముషీరాబాద్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లలో వందల కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి ప్రజల కళ్లముందు ఉందని, పని చేసేటోడు ఎవరో, పని రానోడు ఎవరో గమనించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే రెట్టింపు మెజారిటీ సాధించబోతున్నట్లు తెలిపారు.
ఏ పార్టీ సర్వే చేసినా ముషీరాబాద్లో బీఆర్ఎస్ గెలువబోతుందని స్పష్టమవుతుందని అన్నారు. ప్రతి బస్తీ, ప్రతి ఇంటిలో ఏదో ఒక సంక్షేమ పథకం పొందిన వారు ఉన్నారని, వారంతా బీఆర్ఎస్ వెంట ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దళితులు, మైనారిటీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతుబంధు సహాయాన్ని నిలిపి వేయాలని అంటున్నారని, రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నారని మండిపడ్డారు. రైతులు, దళితుల పట్ల కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్న తీరు, వారి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని ఈ సదర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా సంక్షేమ పథకాల అమ లు, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజల్లో తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఠా జయసింహ, రావులపాటి మోజస్, బి. శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ గూటికి ఎస్బీ వాసుదేవరెడ్డి ..
మాజీ కాంగ్రెస్ నేత, కార్మిక నాయకుడు ఎస్బీ మోహన్రెడ్డి తనయుడు ఎస్బీ వాసుదేవరెడ్డి త్వరలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ చేరనున్నారు. ముషీరాబాద్లో కార్మిక నేతగా మంచి పేరున్న వాసుదేవరెడ్డి సీఎం కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు తెలిపారు. సోమవారం అడిక్మెట్ డివిజన్ బాలాజీనగర్లోని వాసుదేవ రెడ్డి నివాసానికి వచ్చిన బిఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ పార్టీలో చేరికపై చర్చించారు. త్వరలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి, మాధవ్, శ్యామ్సుందర్, సయ్యద్ అస్లాం, రమేష్, వెంకట్రామ్రెడ్డి, సురేందర్, ప్రవీణ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రింకుసింగ్ తదితరులు పాల్గొన్నారు.