మన్సూరాబాద్, డిసెంబర్ 25: పెండ్లి అయ్యిం ది.. ఇద్దరు పిల్లలున్నారు.. అయినా ఓ యువతిని ప్రేమ పెండ్లి పేరుతో వేధించాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేయగా జైలుకు వెళ్లాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. యువతిని వేధించడం మానలేదు. మరోసారి యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. మన్సూరాబాద్, వెంకటరమణ కాలనీకి చెందిన మల్లేశ్(36)కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లేశ్ ఫైనాన్స్ వ్యాపారి. డ్రైవింగ్ కూడా చేస్తుంటాడు. ఏడాది కిందట వీకర్ సెక్షన్కాలనీకి చెందిన ఓ యువతి(22)తో మల్లేశ్కు పరిచయం ఏర్పడింది.
ఇది ప్రేమగా మారింది. కొన్ని రోజుల తర్వాత మల్లేశ్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని సదరు యువతికి తెలిసింది. దీంతో అతడిని నిలదీసింది. అప్పటి నుంచి మల్లేశ్కు దూరంగా ఉంటుంది. దీంతో ఆమె వెంటపడుతున్న మల్లేశ్ వేధించడం మొదలుపెట్టాడు. తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానంటూ హెచ్చరించాడు. దీంతో ఆ యువతి ఆరు నెలల కిందట ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మల్లేశ్ను అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లాడు.. ఇటీవలే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఇదిలా ఉండగా.. బాధిత యువతికి పెండ్లి సంబంధం కుదిరింది. ఈ విషయం మల్లేశ్కు తెలిసింది. సదరు యువతి, యువకుడు ఈనెల 22న వీకర్ సెక్షన్ కాలనీలోని ఓ కిరాణా షాపు వద్ద ఉండగా.. మల్లేశ్ అక్కడికి వచ్చి వారిపై దాడి చేశాడు. 23న యువతి ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మల్లేశ్పై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.