అబిడ్స్, ఫిబ్రవరి 4 : ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల ఆరోతేదీ నుంచి మార్చి 31 వరకు ప్రతి ఆదివారం సమావేశాలు నిర్వహించి ఆస్తి పన్నులో అసమానతలు, ఇతర ఆస్తి పన్ను పరిష్కారాలకు గాను ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మొదలుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లింపులో ఏవైనా అసమానతలు ఉన్నా, నివాసం ఖాళీగా ఉన్న వారు ఈ సమావేశాలలో పరిష్కరించుకునేందుకు గాను ఆస్కారం ఉంది. ఇందుకు గాను సమావేశాల్లో ప్రత్యేకంగా దరఖాస్తులను అధికారులు స్వీకరించి పరిష్కారం కనుగొంటారు.
పన్ను వసూలుకు మార్చి 31 గడువు తేదీ కావడంతో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు గాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ పన్ను పరిష్కార సమావేశాలను నిర్వహించనున్నారు. మొత్తం ఎనిమిది వారాలు ఫిర్యాదులను స్వీకరించి ఆయా ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో సందర్శించి నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత పన్ను పరిష్కారం చేపడతారు. జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసు నేతృత్వంలో జరిగే ఈ సమావేశాలలో పన్ను దారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలించి వివరణ ఇస్తారు.
ఆస్తిపన్ను చెల్లింపులో భాగంగా ప్రతి ఆదివారం నిర్వహించే ఆస్తిపన్ను పరిష్కార సమావేశంలో భవనాల యజమానులు తమ పన్ను చెల్లింపులో ఉన్న సమస్యల గురించి భవన యజమానులు అధికారులతో చర్చించి పరిష్కరించనున్నారు. ప్రతి ఆదివారం యజమానులు కార్యాలయానికి విచ్చేసి అధికారుల సమక్షంలో వారి సమస్యలను వివరిస్తారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని అధికారులు పరిష్కరించి, పరిష్కరించలేని సమస్యలను విచారణ జరిపిన తర్వాత పరిష్కార చర్యలు తీసుకుంటారు.
ఆస్తిపన్ను పరిష్కార సమావేశాలు ఈ నెల 6 నుంచి ప్రారంభమై మార్చి 31 వరకు ఎనిమిది ఆదివారాలు నిర్వహించడం జరుగుతుందని జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసు తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపు విషయంలో భవన యజమానులకు ఎలాంటి అభ్యంతరాలున్నా పరిష్కార సమావేశంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.