దుండిగల్, డిసెంబర్ 30 : అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అయ్యప్ప మాలధారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. దుండిగల్లోని గండిమైసమ్మ చౌరస్తాలో పలువురు అయ్యప్పమాలధారులు శుక్రవారం కొద్దిసేపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నరేశ్ అనే నాస్తికుడు అయ్యప్పస్వామి పుట్టుకపై అనుచిత వాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు ముత్యం, శ్రీకాంత్, గోపి, వెంకటేశ్, లక్ష్మణ్, కృష్ణ, శంకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మేడ్చల్, డిసెంబర్ 30: మేడ్చల్ పట్టణంలో అయ్యప్ప భక్తులు శుక్రవారం నిరసన ప్రదర్శన జరిపారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం పోలీస్స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. బైరి నరేశ్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ స్వామి యాదవ్, ప్రశాంత్, శంకర్, విజయ్కుమార్, రాజు, రామస్వామి, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సైదాబాద్/మలక్పేట: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అయ్యప్పమాలధారు లు, బీజేపీ, హిందూ ధార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. సైదాబాద్ హనుమాన్ మఠం నుంచి పాదయాత్రగా అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సైదాబాద్ పోలీస్స్టేషన్ వరకు అయ్యప్పభక్తులు భారీగా తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె.సుబ్బరామిరెడ్డికి వినతి పత్రం అందజేసి.. నరేశ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు బాలకృష్ణ, రఘు, వీరేంద్రబాబు, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి, సహదేవ్ యాదవ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి, సుభాష్ చందర్జీ, ఉగాది మహేశ్, నిరంజన్, వినోద్, సందీప్ సాగర్, అభి యాదవ్ పాల్గొన్నారు. అదే విధంగా నరేశ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డికి మలక్పేట ఓబీసీ మోర్చా కన్వీనర్ గంగిశెట్టి రాజేశ్, నవీన్, కుమార్, భార్గవ్ తదితరులు ఫిర్యాదు చేశారు.
ముసారాంబాగ్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నాయకులు బొక్క మధుసూదన్రెడ్డి, బొక్క భాగ్యలక్ష్మి, సందడి సురేందర్రెడ్డి, గౌర దేవేందర్, తుమ్మలపల్లి రమేశ్రెడ్డి, కొప్పుల దినేశ్, కొంగర ప్రవీణ్, బాలకృష్ణ, సురేందర్ తదితరులు మలక్పేట పోలీస్ స్టేషన్కు చేరుకొని ఎస్ఐ సురేశ్కు ఫిర్యాదు చేశారు. నరేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్వాన్: బైరి నరేశ్ను శిక్షించాలని కోరుతూ కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం నుంచి గుడిమల్కాపూర్ చౌరస్తా వరకు అయ్యప్ప భక్తులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంతో భక్తితో కొలిచే దేవుళ్లను కించపరిచిన బైరి నరేశ్ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవుళ్లను అవమానించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అబిడ్స్, డిసెంబర్ 30 : భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అఫ్జల్గంజ్ చౌరస్తాలో నిరసన తెలిపారు. సేవా సమితి అధ్యక్షుడు క్యాతం రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాకేశ్, కోశాధికారి ఎం. రాకేశ్లు మాట్లాడారు. అనంతరం బైక్ ర్యాలీగా సైబర్ క్రైమ్ కార్యాలయానికి చేరుకొని ఏసీపీ ప్రసాద్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు సంతోష్, కల్యాణ్, అనిల్ నాయర్, నరేశ్, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్: జవహర్నగర్లో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జవహర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పభక్తులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.