కంటోన్మెంట్, ఆగస్టు 4: కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం కాదని బీజేపీకి చెందిన సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రకటిస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో విలీన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. కంటోన్మెంట్లో డబుల్ బెడ్ రూమ్ల వద్ద ఆందోళనకు వచ్చే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చేసిన వ్యాఖ్యలతోపాటు, కేంద్ర వైఖరిపై స్పష్టత ఇవ్వాలన్నారు. లేదంటే కంటోన్మెంట్లో కిషన్రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గం, పికెట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట్లాడారు. కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉన్నదన్నారు.
పదవిని అడ్డుపెట్టుకొని దందాలు..
కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిని అడ్డుపెట్టుకొని రామకృష్ణ అక్రమ దందాలకు పాల్పడుతున్నాడని క్రిశాంక్ ఆరోపించారు. మహేంద్ర హిల్స్లో అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలకడం, పార్కులను కబ్జా చేయడం, అక్రమంగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం రామకృష్ణకే చెల్లిందన్నారు. తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్, కంటోన్మెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బోర్డు ఎన్నికలు పెడితే గెలువలేననే భయంతో రామకృష్ణ.. కేంద్రంలో లాబియింగ్ చేసి నామినేటెడ్ పదవితో మూడున్నరేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కంటోన్మెంట్లో పర్యటించిన బండి సంజయ్ కేంద్రం నుంచి సర్వీస్ చార్జీలు ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పారని ఆరోపించారు. తిరుమలగిరి చెరువు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 కోట్లు మంజూరు చేసినా, రామకృష్ణ నిధులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పదవీ కాంక్ష కోసం తోటి బోర్డు సభ్యులను మోసం చేసిన చరిత్ర రామకృష్ణదని మండిపడ్డారు.
ప్రధాని హామీలేమయ్యాయి..?
భారతదేశంలోని సొంత ఇల్లులేని పేదలకు ఇంటిని నిర్మిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. అదే కంటోన్మెంట్లో రాష్ట్ర సర్కారు మారేడ్పల్లి, రసూల్పుర, సిల్వల్ కాంపౌండ్, మడ్పోర్టు, అంబేద్కర్నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చిందని తెలిపారు. ఉచిత తాగునీటి విషయంలోనూ అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని క్రిశాంక్ బీజేపీ నేతలకు హితువు పలికారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయండని రామకృష్ణ పిలుపు ఇవ్వడంపై క్రిశాంక్ మండి పడ్డారు. ప్రజలను ఎందుకు రెచ్చగొడుతావ్.. దమ్ముంటే నీవే అడ్డుకోవాలని సవాల్ విసిరారు.