మహబూబ్ నగర్ : గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో జడ్చర్లలోని పాతబజార్ కు చెందిన ఎం మానస(19) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కూతురు మరణ వార్త విన్న తండ్రి షాక్కు గురయ్యాడు. ఐదేండ్ల క్రితం భార్యను కోల్పోయాను.. ఇప్పుడు కూతుర్ని కూడా కోల్పోయాను అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఓపెన్ ఇంటర్ పూర్తి చేసిన మానస సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో గత రెండేళ్లుగా అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ చిన్న చిన్న షూటింగుల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. వారం రోజుల క్రితం ఇంటికి వచ్చిన మానస… శుక్రవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ వెళ్లినట్లు మృతురాలి తండ్రి రవి తెలిపారు. 2018లో అడ్డాకల్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మానస… అప్పట్లో ప్రాణాలతో బయట పడింది. 2016లో తల్లి హత్యకు గురయింది. ఇద్దరు కూతుళ్లను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశానని.. ఇప్పుడు చిన్న కూతురు లేకుండా పోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.