సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ కేంద్రాలకు నగరమే ప్రధాన హబ్కానుంది. ఇప్పటికే గ్రేటర్తో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పనిచేస్తున్న డయాలసిస్ కేంద్రాలను నగరంలోని ప్రధాన ట్రెషరీ హాస్పిటల్స్ పర్యవేక్షిస్తున్నాయి. రోజు రోజుకు కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరిగిపోవడంతో డయాలసిస్ రోగుల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ డయాలసిస్ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్కు అప్పగించారు.
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న 102డయాలసిస్ కేంద్రాలను మూడు క్లస్టర్లుగా విభజించారు. అదే సమయంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్ను ప్రధాన హబ్స్గా ప్రకటించారు. ఒక్కో హబ్ పరిధిలో ఒక్కో క్లస్టర్లోని డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తాయని వైద్యాధికారులు తెలిపారు. నిమ్స్ పరిధిలో ఇప్పటికే 18 డయాలసిస్ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. దీని పరిధిలోకి మరో 18కేంద్రాలు కొత్తగా రానున్నట్లు నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ స్వర్ణలత తెలిపారు. నిమ్స్ పరిధిలో మొత్తం 40సెంటర్స్ పనిచేయనున్నట్లు వివరించారు. ఉస్మానియా పరిధిలో 30, గాంధీ పరిధిలో 32సెంటర్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సేవలందించనున్న డయాలసిస్ సెంటర్లు, ముఖ్యంగా పేషెంట్ కేర్, డయాలసిస్ సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, డయాలిస్ కేంద్రాల్లో సేవలందించే వైద్యసిబ్బందికి అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైనప్పుడు అయా సెంటర్లకు వెళ్లి కన్సల్టేషన్ ఇవ్వడం, డయాలసిస్ చేస్తున్న తీరుతెన్నులను పరిశీలించడం వంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.