ఘట్కేసర్,జనవరి28: పాఠశాలల ఆధునీకరణకు ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు..మన బడి కార్యక్రమంలో భాగంగా పోచారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దారు. ఈ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోచారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మన ఊరు..మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7.34లక్షలతో పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పా టు చేశారు. ఈ పనులు ఎంత వరకు జరిగాయి, విద్యార్థులకు ఉపయోగపడుతున్న తీరును ఆయన చైర్మన్ కొండల్రెడ్డి, కమిషనర్ సురేశ్ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక మూత్రశాలలు, మరుగుదొడ్లు,ప్రహరీ,పర్నీచర్ను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న మున్సిపాలిటీ నర్సరీలోని మొక్కలను ఆయన పరిశీలించారు. పోచారం మున్సిపాలిటీ ప్రగతి నివేదికను చైర్మన్ కొండల్రెడ్డి అడిషనల్ కలెక్టర్కు అందజేశారు.పాఠశాల ప్రిన్సిపాల్ రజిత,కౌన్సిలర్ శ్రీలత,ఏఈ నరేశ్,బీఆర్ఎస్ నాయకుడు జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్
ఘట్కేసర్ రూరల్, జనవరి 28: ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ ఆగస్త్య అన్నారు.ప్రతాపసింగారం జడ్పీ పాఠశాలను జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. అనంతరం విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతుల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమ శిక్షణ, పట్టుదలతో చదవడం వల్ల ఉన్నత లక్ష్యానికి చేరుకోవచ్చన్నారు. అనంతంర ప్రతాపసింగారం పంచాయతీ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఇంటి పన్నుల వసూలుపై దృష్టి సారించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో జడ్పీచైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీడీవో అరుణ, ఎంపీవో నందకిశోర్,సర్పంచ్ శివ శంకర్, ప్రిన్సిపాల్ రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.