హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పక్కా కమీషన్రెడ్డిగా మారారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. పని ఏదైనా ఆయనకు కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కరువు పరిస్థితులపై ఇదే జిల్లాకు చెందిన మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ లేకుండానే మంత్రులు పొంగులేటి, పొన్నం కలిసి సమీక్షించడం శోచనీయమని పేర్కొన్నారు.
ఈ వ్యవహారం కాంగ్రెస్లోని కుమ్ములాటలకు అద్దంపడుతున్నదని వ్యాఖ్యానించారు. గిరిజన, బీసీ మంత్రులపై పొంగులేటి కక్ష కట్టారా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, బీఆర్ఎస్ నేత లక్ష్మణ్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కన్నెపల్లి, దేవాదుల పంపులు ఆన్చేసి నీరెత్తిపోయాలని అడిగిన బీఆర్ఎస్ నేతలపై నిందారోపణలు చేయడం దుర్మార్గమని ఖండించారు. ఇన్చార్జి మంత్రి పొంగులేటితో ఉమ్మడి వరంగల్కు శనిపట్టిందని విమర్శించారు. సమీక్షకు పిలువకుండా అవమానించిన మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎల్ నినో కారణంగా కరువు ముంచుకొస్తుంటే కాంగ్రెస్ సర్కార్కు స్పష్టత కరువైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. జూన్ 1 నుంచి కన్నెపల్లి వద్ద నీటి ప్రవాహం ఉన్నా ఎత్తిపోయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దు య్యబట్టారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏడు రకాల వరి విత్తానలపైనే సమీక్షించారని, కానీ బయటకు మాత్రం సాగునీటిపై చర్చించినట్టు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిచి దేవాదుల పంపులు ఆన్చేసిందని స్పష్టంచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహనలేని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.