ప్రస్తుతానికి మండలానికి రెండు స్కూళ్లు
32 పాఠశాలల్లో మరమ్మతులు,అభివృద్ధి పనులు
రెండుమూడు రోజుల్లో పనులు షురూ
‘మన ఊరు-మనబడి’తో ప్రభుత్వ బడులకు మహర్దశ
సిటీబ్యూరో, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి పథకంలో భాగంగా జిల్లాలో 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఏప్రిల్లో ప్రారంభం కాబోతున్నాయి. స్కూళ్ల అభివృద్ధి ప్రతిపాదనలను మండలాల వారీగా కలెక్టర్కు ఆన్లైన్ ద్వారా పంపుతున్నట్లు విద్యా మౌలిక వసతి సదుపాయాల కల్పన సంస్థ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షఫీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి చేయనున్న 239 పాఠశాలల్లో మరమ్మతులు, ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కోసం రూ.9.35 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. పాఠశాలల్లో అభివృద్ధి పనుల కోసం వచ్చే వారంలో కలెక్టర్ పరిపాలన అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి జిల్లాలోని ప్రతి మండలానికి రెండు చొప్పున మొత్తం 32 పాఠశాలల్లో మరమ్మతులు, అభివృద్ధి పనులు రెండు లేదా మూడు రోజులలో ప్రారంభించడానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రూ.30 లక్షల లోపు బడ్జెట్ ఉన్న పాఠశాలల్లో పనులు వెంటనే ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికార వర్గాలు తెలిపాయి.