9న ‘మన బస్తీ-మన బడి’ పనులు ప్రారంభం
తొలి విడత 239 పాఠశాలల్లో అమలు
నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించం
విద్యార్థుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టిస్తాం
సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు పాఠశాలల కన్నా.. సర్కారు బడుల్లోనే అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొనేలా బడులను అభివృద్ధి పర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2022) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ‘మన బస్తీ – మన బడి’ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు -మనబడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందుకోసం 11మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 9న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ‘మన బస్తీ – మన బడి’ పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
తొలి విడతలో 239పాఠశాలలు ఎంపిక
హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేసి అంచనాలను కూడా సిద్ధం చేశారు. ఈ నెల 9న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనే విధంగా బడులను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టించి అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదు
‘మన బస్తీ – మన బడి’ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత డిప్యూటీ డీఈఓలపై ఉంటుందని, విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాఠశాలల వారీగా సిబ్బంది, ఉపాధ్యాయుల ఖాళీలకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించి అందజేయాలన్నారు.
క్రీడా మైదానాలుగా జీహెచ్ఎంసీ స్థలాలు
నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని రెడ్ క్రాస్ సొసైటీ సూల్లో నెలకొన్న సమస్యలను పరిషరించాలని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సమావేశం దృష్టికి తీసుకు రాగా, త్వరలో సూల్ను సందర్శించి సమస్యల పరిషారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని ప్రభుత్వం అందిస్తుందన్నారు. పాఠశాలల్లో సరైన క్రీడా మైదానం లేకుంటే స్థానికంగా ఉన్న జీహెచ్ఎంసీ స్థలాలను గుర్తించి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ఎంఎస్.ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, ఆర్జేడీ విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
10వ తేదీలోగా పూర్తిచేస్తాం: కలెక్టర్ హరీశ్
మేడ్చల్ కలెక్టరేట్, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. బీఆర్కే భవన్ నుంచి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 176 పాఠశాలలను ఎంపిక చేయగా.. ఇప్పటి వరకు 68 పాఠశాలల్లో దాదాపు పనులు పూర్తయ్యాయని, 10వ తేదీలోగా మిగిలిన అన్ని పాఠశాలల్లో పూర్తిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.