శంషాబాద్ రూరల్, జూన్ 5: నకిలీ విత్తనాల విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. తాజాగా షాద్నగర్ పరిసరాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.40లక్షల విలువైన 1.5టన్నుల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి, శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన తోటకూర రంగారావు గత పదేండ్లుగా కర్నూల్ జిల్లాలోని వెంకటరమణ కాలనీలో నివాసముంటూ అక్కడే తనకు ఉన్న భూమిలో వ్యవసాయం ముసుగులో నిషేధిత బీజీ-3/హెచ్టీ విత్తనాలను సాగుచేస్తున్నాడు. ఈ విధంగా సాగుచేసిన నకిలీ విత్తనాలను కర్ణాటకలో గిన్నింగ్ చేయించి, రసాయనాలు, రంగులు అద్ది రైతులకు సరఫరా చేస్తున్నాడు. నిందితుడు గత కొంత కాలంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లోని రైతులకు నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ మోసగిస్తున్నాడు.
గతంలోనూ పట్టుబడి….
నకిలీ విత్తనాలు విక్రయిస్తూ గతంలోనూ రంగారావు పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై ఆదిలాబాద్ జిల్లాలోని బీమీని, తాండూరు పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయినా తీరు మార్చుకోని నిందితుడు నకిలీ విత్తనాలు విక్రయిస్తూ అమాయక రైతులను మోసగిస్తున్నాడు. కర్నూల్లో పండించిన నకిలీ పత్తి విత్తనాలను ఆదివారం షాద్నగర్ మీదగా హైదరాబాద్ వైపు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో షాద్నగర్ పోలీసులు, వ్యవసాయ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిందితుడు తోటకూర రంగారావును అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.40లక్షల విలువజేసే 1.5టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.