బడంగ్పేట, సెప్టెంబర్ 19: మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘట్లోని గ్రీన్పార్కు కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం విందు చేసుకున్నారు. వారికి తోడుగా భార్గవ్ (21), శరత్ కూడా వచ్చారు. విందు అయిపోయిన తర్వాత మణికంఠ తనను ఇంటి వద్ద దింపాలని కోరుతూ శరత్కు ఫోన్ చేశాడు. జిల్లెలగూడలోని బాలాజీ కాలనీకి వచ్చారు. మణికంఠ తల్లి తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న రమాదేవి ఇంటికి వెళ్లారు. అమ్మకు కాల్ చేస్తాను.. ఫోన్ ఇవ్వమని అడిగారు.
రమాదేవి ఇంట్లో శుభకార్యం ఉండటంతో వారందరూ మేల్కొని ఉన్నారు. మేడ్చల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రూపేశ్ బయటకు వచ్చి ఈ రాత్రి ఫోన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి, గొడవకు దారితీసింది. అక్కడి నుంచి మణికంఠ, శరత్ కలిసి వారి స్నేహితులైన నరేందర్, భార్గవ్, ప్రవీణ్కు ఫోన్ చేశారు. ఈ ఐదుగురు కలిసి రమాదేవి ఇంటికి వెళ్లి మరోసారి గొడవపడ్డారు. మణికంఠ ఇటుకతో ఎక్సైజ్ కానిస్టేబుల్ రూపేశ్ను కొట్టాడు. శుభకార్యానికి వచ్చిన వారందరూ ఎదురు తిరిగి ఐదుగురిపై దాడి చేశారు. అందరూ మద్యం మత్తులో ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఐదుగురిలో నలుగురు తప్పించుకొని పారిపోగా.. భార్గవ్ కింద పడటంతో అందరు కలిసి అతడిపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఒవైసీ ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. భార్గవ్ మృతికి కారణమైన రమాదేవి, ఎక్సైజ్ కానిస్టేబుల్ రూపేశ్, వరలక్ష్మి, బబ్లూపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ యాదయ్య తెలిపారు.