గాజులరామారం, డిసెంబర్ 13: ప్రైవేట్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీనబంధు కాలనీకి చెందిన పి.సురేశ్ (40) ప్రైవేట్ ఉద్యోగి. మూడు లోన్ యాప్ల ద్వారా రుణం తీసుకున్నాడు.
వాయిదాలు కూడా చెల్లిస్తున్నాడు. అయినా.. యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు తప్పలేదు. ఇటీవల వేధింపులు పెరగడంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.