Hyderabad | హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మైనర్ బాలిక(9)తో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది తెలిసి బాధిత బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నిందితుడిపై దాడిచేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూం బ్లాక్లో నివాసం ఉండే అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నిలోఫర్ ఆస్పత్రి వద్ద టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అదే బ్లాక్లో నివాసం ఉండే నాలుగో తరగతి విద్యార్థినితో ఇటీవల అతను అనుచితంగా ప్రవర్తించాడు. మైనర్ బాలికకు ముద్దులు పెడుతూ.. ప్రైవేట్ పార్ట్స్ను తాకాడు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అది చూసి బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆవేశంతో నిందితుడిపై దాడికి దిగారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అజీజ్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.