కంటోన్మెంట్, ఆగస్టు 20 : ఒంటరిగా ఉంటున్న ఓ వ్యక్తి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానా బస్తీకి చెందిన కిషోర్(46) వృత్తి రీత్యా కార్పెంటర్. వయస్సు మీరుతున్నా పెండ్లి కాకపోవడం, ఒంటరిగా జీవనం సాగిస్తుండటంతో మానసిక ఒత్తిడిలోనై కిషోర్ గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు.
ఈ క్రమంలోనే రెండు రోజులుగా జాండీస్తో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మానసిక క్షోభకు గురైన కిషోర్ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి నడుచుకుంటూ హనుమాన్ ఆలయం వద్దకు వెళ్లి గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతరం దేవుని విగ్రహం ఎదురుగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలియక కిషోర్ తమ్ముడు ప్రదీప్ అన్న ఇంటికి వచ్చి చూశాడు. ఇంట్లో లేకపోవడం చూసి చుట్టు పక్కల వారిని, స్నేహితులను అడిగినా ఫలితం దక్కలేదు.
ఈ నేపథ్యంలోనే వెతుకుతుండగా కొంతమంది తారసపడి హనుమాన్ ఆలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే కిషోర్ ఉరివేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.