సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ బస్సుల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్కు డ్రగ్స్ను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకొని.. నగరంలోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకున్నారు. నిందితుల నుంచి రూ. 56 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్బాబు వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ జోదాపూర్కు చెందిన శశిపాల్ బిష్ణోయ్పై గతంలో డ్రగ్ స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. అదే ప్రాంతానికి చెందిన మదన్లాల్ బిష్ణోయ్ గతంలో జీవీఆర్ ట్రావెల్స్లో ఆఫీస్ అస్టెంట్గా పనిచేశాడు. ఆ సమయంలో శశిపాల్ పరిచయమయ్యాడు. ఇద్దరు స్నేహితులుగా మారారు. దీంతో పాటు ఈ ట్రావెల్స్లో ఒక బస్సును మదన్లాల్ ఎంగేజ్ చేశాడు. ఈ క్రమంలో ట్రావెల్స్తో మంచి సంబంధాలు ఉండటంతో పాటు వీరిద్దరికీ ఓపియం, పప్పీ స్ట్రా సైప్లె డీలర్స్తో మంచి పరిచయాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్కు శశిపాల్ గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ గతేడాది నవంబర్లో నేరేడ్మెట్ పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మదన్లాల్తో కలిసి డ్రగ్ దందా చేసేందుకు ప్లాన్ చేశాడు. ట్రావెల్స్ నిర్వాహకులతో మదన్లాల్కు పరిచయం ఉండటంతో ఇద్దరు కలిసి రాజస్థాన్లో డ్రగ్స్ కొని హైదరాబాద్లో దానిని విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి మూడున్నర కిలోల ఓపియం, 45 గ్రాముల పప్పీ స్ట్రా పౌడర్ను కొని హైదరాబాద్కు బయలుదేరారు. సోమవారం ఉదయం ఎస్ఆర్నగర్లో కుషాయిగూడ పోలీసులతో కలిసి మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ రాములు బృందం బస్సులలో తనిఖీలు నిర్వహించగా.. ఈ ఇద్దరు పట్టుబడ్డారు. ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి డ్రగ్స్, రూ. 2,80,500 నగదు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు, ఒక ట్రావెల్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రాజస్థాన్కు చెందిన నిందితులకు అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని సీపీ తెలిపారు.
శిక్షల శాతాన్ని పెంచడంపై దృష్టి పెడతామని సీపీ సుధీర్బాబు తెలిపారు. ఈ అంశంపై సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శిక్ష శాతం 22 ఉన్నదని, దీనిని 80 శాతానికి పైగా తీసుకెళ్లాలన్నారు. డ్రగ్స్ అణిచివేతపై ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు, టీన్యాబ్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామన్నారు. డ్రగ్ కేసుల్లో పట్టుబడితే 10 నుంచి 20 ఏండ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.