Lok Sabha Elections | మేడ్చల్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ స్వీకరించనున్నారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎన్నికల విధి నిర్వహణలో 19,448 మంది సిబ్బంది పాల్గొనున్నారు. ఇందులో అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.
మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ఓట్లను కీసర మండలం బోగారంలోని హోళీమేరి కళాశాలలో లెక్కించనుండగా, ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లను సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియం, కంటోన్మెంట్ నియోజకవర్గం చెందిన ఓట్లను సీఎస్ఐ వెస్లీ గ్రౌండ్లో లెక్కించనున్నారు.
సి-విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తూ ఆ ప్రాంత ైప్లెయింగ్ స్వాడ్, సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ నోడల్ అధికారికి అందించాలని ఎన్నికల అధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ వీసీ హాల్లో పోలీస్, ఎక్సైజ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, అడిషనల్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సి-విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ధేశిత సమయంలో ఆధారాలు సేకరించాలని, సీజ్ చేసిన డబ్బులు వస్తువులను (ESMS) యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని, తనిఖీల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, కూకట్పల్లి, సికింద్రాబాద్, జోనల్ కమిషనర్లు అభిలాష అభినవ్, రవి కిరణ్, ముకుంద రెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ హన్మంతరావు, కీసర ఆర్డీఓ వెంకటఉపేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఆర్డీఓ శ్యామ్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.