మలక్పేట, డిసెంబర్ 23: ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతాయని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల తెలిపారు. పాత మలక్పేట డివిజన్లోని వాహెద్నగర్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ బిర్జిస్ ఉన్నీసా, మెడికల్ అధికారి డాక్టర్ జ్యోతి, డాక్టర్ తరుణ్ పర్యవేక్షణలో నిర్వహించిన నేత్ర, దంత వైద్య పరీక్షలు, ఆర్థొపెడిక్, న్యూరో పరీక్షలతోపాటు ఆయుర్వేదిక్, కొవిడ్ టెస్టులతో ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరాన్ని శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ.. పాత మలక్పేట డివిజన్ మూసీ పరీవాహక ప్రాంతం పొడవునా ఉండటంతో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఎక్కువగా అనారోగ్యాల బారినపడే అవకాశం ఉన్నందున ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసేందుకు ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మలక్పేట నియోజకవర్గంలో అనేక బస్తీలు కాలనీలు ఉన్నాయని, చాలామంది పేదలు అనారోగ్యానికి గురైనా, ప్రైవేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యం చేయించుకునే స్థితిలో లేరని, వారందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత మలక్పేట డివిజన్ బస్తీ దవాఖాన, శాలివాహననగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు, సిబ్బందితోపాటు డివిజన్ ఎంఐఎం నాయకులు షఫీ, వాసు, సజ్జాద్ తదితరులు పాల్గొన్నారు.