బడంగ్పేట/మహేశ్వరం నవంబర్10: మహేశ్వరం నియోజక వర్గం సబితా ఇంద్రారెడ్డి నామినేషన్ పర్వానికి గులాబీ దళం కదం తొక్కారు. జీప్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజే సౌండ్తో గులాబీ జెండాలను పట్టుకొని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా ఎక్కడా చూసిన గెలాబీ జెండాలు రెప రెపలాడాయి. గెలుపు ఖాయం అయిందన్న రీతిలో వేల సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. ఏ రోడ్డు చూసిన గులాబీ జెండాలతో నిండి పోయింది. శుక్రవారం మహేశ్వరం నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు సబితా ఇంద్రారెడ్డి భవానీ మాతకు ప్రత్యేక పూజలు చేసి దివంగత పటోళ్ల ఇంద్రారెడ్డి సమాధి వద్ద నివాళు లర్పించారు. కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారం లోకి రానుందని, పట్లోళ్ల, తీగల బలగంతో బీఆర్ఎస్కు తిరుగులేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరంలో నామినేషన్ వేసిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజక వర్గంలో యువకులు, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంత్రికి బారీ క్రేన్ సహాయంతో బారీ గజమాలతో సత్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని ప్రజలు సీఎం కేసీఆర్కు అండగా ఉండి మరో సారి బీఆర్ఎస్ను గెలిపించాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు.
రాబోయో ఎన్నికలలో అభివృద్ధికి పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఆమె కోరారు. నియోజక వర్గం ఆడబిడ్డగా దీవించి అన్నా, తమ్ముల్లు, అక్కా, చెల్లేండ్లు, మీరంతా బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించి మరో సారి నన్ను మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ప్రజా సేవకులకు జరుగుతున్న ఓట్ల యుద్ధంలో నియోజక వర్గం ప్రజలే న్యాయ నిర్ణేతలని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ బలగంతో సీఎం కేసీఆర్కు మనమంతా అండగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. కరెంటు కష్టాలతో కర్ణాటకలో రైతులు సబ్స్టేషన్లో మొసళ్లను ఉంచారని ఆమె అన్నారు. అక్కడి తరహా పాలన తెలంగాణలో అవసరమా అని ఆమె ధ్వజమెత్తారు. కష్టాల కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మవద్దని ఆమె అన్నారు. ప్రతి పక్ష పార్టీల నాయకుల మాటలను నమ్మి మరో సారి తెలంగాణకు మోసం చెయ్యవద్దని ఆమె సూచించారు.